ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడి వైపు చూడ్డానికి హీరోలు భయపడుతుంటారు.. నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఓసారి దెబ్బ తిన్న తర్వాత.. మళ్లీ వాళ్ళతోనే సినిమా అంటే కచ్చితంగా ఆలోచించుకోవాల్సిందే. అయితే నిజంగా ఆ దర్శకుడిలో మ్యాటర్ ఉంటే మాత్రం పిలిచి మరీ అవకాశాలు ఇచ్చే నిర్మాతలు, హీరోలు మన ఇండస్ట్రీలో ఉన్నారు. అదే జరుగుతుందిప్పుడు టాలీవుడ్లో. ఒకరు ఇద్దరు కాదు.. చాలా మంది ఫ్లాప్ దర్శకులకు మళ్లీ ఆ హీరో, నిర్మాతలే ఆఫర్ ఇస్తున్నారు. వినడానికి విచిత్రంగా ఉంది కదా..!
గతేడాది ‘అంటే సుందరానికి’ సినిమాతో నానికి ఫ్లాప్ ఇచ్చాడు యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. దానికి ముందు ఈయన చేసిన మెంటల్ మదిలో, బ్రోచేవారెవురురా సినిమాలు మంచి విజయం సాధించాయి. దాంతో నాని సినిమాతో హ్యాట్రిక్ పక్కా అని అంతా ఫిక్సైపోయారు. అంటే సుందరానికి సినిమాకు టాక్ కూడా బాగానే వచ్చింది కానీ కలెక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి సినిమా వెనకబడింది.
గతేడాది వచ్చిన ఈ సినిమా ఎక్కడో మిస్ ఫైర్ అయింది. థియేటర్స్లో మిస్ ఫైర్ అయినా.. ఓటిటిలో మాత్రం సూపర్ హిట్ అయింది అంటే సుందరానికి. నాని ఫ్యామిలీ ఇమేజ్కు ఈ కథ బాగానే సెట్ అయింది. అందుకే వివేక్ ఆత్రేయపై మరోసారి నమ్మకం పెట్టుకున్నాడు నాని. ఆయనకు మరో ఛాన్సిస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం దసరా సినిమా ప్రమోషన్స్తో పాటు కొత్త దర్శకుడు శౌర్యు తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు నాని. ఈ సినిమా షూటింగ్ మరో నాలుగు నెలల్లో పూర్తి కానుంది.
ఆ తర్వాత మరోసారి వివేక్ ఆత్రేయతోనే సినిమా చేయబోతున్నాడు న్యాచురల్ స్టార్. డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. వివేక్ మాత్రమే కాదు.. జిల్, రాధే శ్యామ్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాధాకృష్ణ కుమార్కు యువీ క్రియేషన్స్ వరసగా మూడో ఛాన్స్ ఇస్తున్నారు. జిల్ మంచి సినిమానే.. కాకపోతే ఓవర్ బడ్జెట్ కారణంగా ఫ్లాప్ అయింది.
ఇక రాధే శ్యామ్ కలెక్షన్ల పరంగా డిజాస్టర్ అయ్యుండొచ్చు కానీ నిర్మాతలు మాత్రం దీనితో సేఫ్ అయ్యారని తెలుస్తుంది. అందుకే రాధాకృష్ణ స్టోరీ టెల్లింగ్పై నమ్మకం ఉంచి యువీ క్రియేషన్స్ వరసగా మూడో అవకాశమిచ్చారు. గోపీచంద్ హీరోగా త్వరలోనే రాధాకృష్ణ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ ఛాన్స్ రావడం వెనక ప్రభాస్ హస్తం ఉందని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఫ్లాపిచ్చినా.. దర్శకులపై హీరోలు, నిర్మాతలకు నమ్మకం తగ్గట్లేదు.