మంచి సినిమా అంటే… గొప్ప కథ దొరకాలి. పాత్రలకు తగ్గ నటీనటులు కుదరాలి. కామెడీ నవ్వించాలి. ఫైట్స్ అబ్బో అనిపించాలి. పాటలు ఇరగదీయాలి. ైక్లెమాక్స్ అదిరిపోవాలి. ఇలా.. రొటీన్కు భిన్నం అంటూనే మూసధోరణిలో వస్తున్న సినిమాలు ఎన్నో! వసూళ్ల పరంగా కోట్లు కొల్లగొట్టినా.. చూసినంత సేపయినా వాటి గురించి మాట్లాడు కోవడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సందేశాత్మక సినిమాల సంగతి దాదాపు మర్చిపోయిన టాలీవుడ్ ప్రయోగాత్మక చిత్రాల దరిదాపుల్లోకి కూడా వెళ్లే సాహసం చేయడం లేదు. ఈ విషయంలో మలయాళ చిత్రసీమ ఆది నుంచీ ముందంజలో ఉంది. కథే ప్రధాన హీరోగా తెరకెక్కుతున్న కొన్ని మలయాళ చిత్రాలు మాలీవుడ్ కథన కుతూహలాన్నినిరూపిస్తున్నాయి..
Mollywood | మలయాళం సులభంగా అర్థం కాదు. ఆ భాష లిపి కూడా కాస్త గందరగోళంగానే అనిపిస్తుంది. ఓటీటీ పుణ్యమా అని మాలీవుడ్ పొరుగింటంత దగ్గరైంది. అక్కడ తెరకెక్కిన సినిమాలు.. ఓటీటీ ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరవుతున్నాయి. కొన్ని డబ్బింగ్ వెర్షన్లుగా పలకరిస్తే.. మరికొన్ని మాతృకలో విడుదలైనా అలరిస్తున్నాయి. భాష బుర్రకెక్కకున్నా.. భావం మనసును హత్తుకుంటున్నది. స్టార్డమ్ హీరోలు లేకున్నా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి ఈ చిత్రాలు. కమర్షియల్ హంగుల్లేని ఈ సినిమాల్లో నటించడానికి మాలీవుడ్ పెద్దహీరోలు ఎలా ఒప్పుకొన్నారా అని ఆశ్చర్యం కలిగిస్తుంది. కథతో రచయితలు, కథనంతో దర్శకులు చేస్తున్న ప్రయోగాలకు కేరళ మాత్రమే కాదు.. దక్షిణాది అంతా ఫిదా అవుతున్నది.
ఇటీవల ఓటీటీలో పలకరించిన కొన్ని మలయాళ చిత్రాలు చూస్తే.. కథనంపై వారు సాగిస్తున్న స్వారీ ఆశ్చర్యం కలిగిస్తున్నది. బడా హీరోలను సైతం కథకు అనుగుణంగానే తప్ప.. అనవసరమైన ఎలివేషన్లకు తావులేకుండా డైరెక్ట్ చేస్తున్నారు. 2000 సంవత్సరానికి ముందుకు వెళ్తే.. మలయాళంలోనూ కమర్షియల్ ఫార్ములా చిత్రాలే ఎక్కువగా కనిపించేవి. అగ్రహీరోలు మమ్ముట్టి, మోహన్లాల్, సురేశ్ గోపి సినిమాలు కమర్షియల్ పంథాలోనే సాగేవి. ఆ తర్వాత జనరేషన్ దర్శకులు కథకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. ఫలితంగా మాలీవుడ్ కొత్త తరహా చిత్రాలకు వేదికగా మారిందని సినీ విమర్శకులు చెబుతున్నారు. కథ బాగుందంటే ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. రోమాంచమ్, సీయూ సూన్, కుంబలంగి నైట్స్, నెయ్మూర్, కాథల్, సాల్ట్ అండ్ పెప్పర్ తదితర చిత్రాలు కథ, కథనాలతో ప్రేక్షకులను అలరించి భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి.
టాలీవుడ్లో మెగాస్టార్కు ఉన్నంత క్రేజ్ మాలీవుడ్లో మమ్ముట్టికి ఉంది. కమర్షియల్ హీరోగా దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అడపాదడపా ప్రయోగాత్మక చిత్రాల్లో మెరిసే ఆయన ఇటీవల వరుసగా రొటీన్కు భిన్నమైన సినిమాలతో పలకరిస్తున్నారు. ‘నాన్పకల్ నేరత్తు మాయక్కమ్’, ‘కన్నూరు స్కాడ్’, ‘కాథల్’, ‘క్రిస్టఫర్’, ‘సీబీఐ 5’, ‘వన్’ తదితర సినిమాలు మలయాళంలో సూపర్ హిట్ సాధించాయి. వీటి తెలుగు వెర్షన్లు ఓటీటీలో విడుదలై ఇక్కడ రికార్డు స్ట్రీమింగ్ సొంతం చేసుకున్నాయి. ‘కన్నూరు స్క్వాడ్’ చిత్రంలో మమ్ముట్టి పోలీస్ అధికారిగా కనిపిస్తాడు. ఓ నేర పరిశోధన కోసం హీరో బృందం ఉత్తరాదికి వెళ్తుంది.
అక్కడ వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నది కథ. ఈ తరహా కథలో హీరోయిజాన్ని పండించడానికి ఎన్ని యాక్షన్ సన్నివేశాలైనా కల్పించే అవకాశం ఉంది. కానీ, ఆ చిత్ర దర్శకుడు వర్గీస్ రాజ్ మాత్రం కథనే నమ్ముకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ కూడా సహజత్వానికి దగ్గరగా తీసి మెప్పించాడు. అందుకే, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఓటీటీలోనూ అంతే ఆదరణ పొందింది. మమ్ముట్టి, జ్యోతిక నటించిన ‘కాథల్- ద కోర్’ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. సున్నితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. 72 ఏండ్ల మమ్ముట్టి కెరీర్లో ఎప్పుడూ లేనంత జోరుగా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడంటే.. ఆయనలోని నటుణ్ని మరింతగా ఆవిష్కరించే కథలతో దర్శకులు సంప్రదిస్తుండటమే కారణం!
ఇటీవల ఓటీటీలో ‘ఫ్యాలిమీ’ అనే సినిమా విపరీతంగా స్ట్రీమింగ్ అయింది. ఈ సినిమాలో హీరో అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. నితీశ్ సహదేవ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఫ్యాలిమీ’ సాదాసీదా చిత్రం. మిస్టరీలు లేకున్నా… ఆకట్టుకుంటుంది. ఓ కుటుంబం కాశీయాత్రకు వెళ్లాలని నిశ్చయించుకుంటుంది. ఒకరితో ఒకరికి పొసగని ఆ కుటుంబ సభ్యుల కాశీ ప్రయాణం ఎలా సాగింది? అక్కడేం జరిగింది? ఈ యాత్ర వాళ్ల కుటుంబంలో ఎలాంటి మార్పు తెచ్చిందన్నదే కథ. మలయాళ సినిమాలు కాస్త నిదానంగా సాగుతాయన్న పేరుంది. అయితే, ఒకసారి ఆ సినిమాతో కనెక్ట్ అయ్యాక.. అది నిదానంగా సాగినా, పరుగులు తీసినా ప్రేక్షకుడి మెప్పు పొందుతుంది అనడానికి ‘ఫ్యాలిమీ’ మంచి ఉదాహరణ. సస్పెన్స్ కథకు కామెడీ జోడించి తీసిన ‘రోమాంచమ్’ సూపర్ హిట్ సాధించింది.
మలయాళంలో 2011లో ‘ట్రాఫిక్’ సినిమా రిలీజైంది. పన్నెండేండ్ల కిందట విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీలో ఆదరణ పొందుతుండటం విశేషం. ఇందులో పకడ్బందీ స్క్రీన్ప్లే కనిపిస్తుంది. ఒకే కథలో నలుగురి నేపథ్యాలను పరిచయం చేసి, అనుకోకుండా ముడిపెట్టి ఊహకందని మలుపు తిప్పాడు దర్శకుడు రాజేశ్ పిైళ్లె. ఉత్కంఠభరితంగా సాగే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్లు అంతగా లేకున్నా… రోమాలు నిక్కబొడిచే సీక్వెన్సులు కొల్లలుగా కనిపిస్తాయి. ఇటీవల మాలీవుడ్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న హీరో ఫహద్ ఫాజిల్. తన నటనతో ఆల్ ఇండియా వాంటెడ్ నటుడు అనిపించుకున్నాడు.
ఆయన ఎప్పుడో నటించిన సినిమాలు సైతం ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. ఫాజిల్ దొంగ పాత్రలో నటించిన ‘తొందిముతలమ్ దక్షక్షియం’ ఓటీటీలో సూపర్ హిట్ అయింది. సినిమా అంతా దొంగ, బాధితులు, పోలీస్ స్టేషన్ వీటి చుట్టూ తిరుగుతుంది. ఓటీటీలో ‘దొంగాట’గా వచ్చిన తెలుగు వెర్షన్ కరోనా సమయంలో రికార్డు స్ట్రీమింగ్ సొంతం చేసుకుంది. కమర్షియల్ పంథాకు అందని ‘కుంబలంగి ఫైల్స్’, ‘ధూమం’ తదితర సినిమాలు మాలీవుడ్ టేకింగ్ స్టయిల్ను ప్రేక్షకులకు పరిచయం చేశాయి.
తెలుగులోనూ అడపాదడపా ఈ తరహా కథన ప్రధాన చిత్రాలు పలకరిస్తున్నాయి. భావోద్వేగాల కన్నా సస్పెన్స్, కామెడీ జానర్లోనే ఇవి ఉంటున్నాయి. పెద్ద హీరోలకు వచ్చేసరికి మాత్రం.. కమర్షియల్ ఈక్వేషన్కు తగ్గేదే లేదంటున్నారు దర్శక నిర్మాతలు. ఓపెనింగ్స్ అదిరిపోతున్నా, రికార్డులు బద్దలవుతున్నా.. తెలుగు సినిమా మాత్రం కొత్తదనాన్ని అందుకోలేకపోతున్నది. పాన్ ఇండియాకు కేంద్రంగా మారుతున్నా.. పసందైన పర్ఫెక్ట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వలేకపోతున్నది. గండ్ర గొడ్డలి చేతపెట్టి వరుసపెట్టి కుత్తుకలు తెగ్గొట్టించాలనే దర్శకుల ఆలోచన మారితే కదా.. ఫీల్ గుడ్ సినిమాలు పుడతాయి. అనామక పాత్రతో కూడా అనవసరమైన పంచ్ డైలాగ్ పలికించే దర్శకుల మైండ్సెట్ మారనంత వరకు తెలుగు సినిమా దారి మారదని పెదవి విరుస్తున్నారు సగటు ప్రేక్షకులు.