ఏపీలో థియేటర్ల సమస్యల గురించి జగన్ ప్రభుత్వంతో మోహన్బాబు మాట్లాడాలని శనివారం జరిగిన ‘రిపబ్లిక్’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో పవన్కల్యాణ్ సూచించిన విషయం తెలిసిందే. వైఎస్ కుటుంబీకులు తమ బంధువులని మోహన్బాబు చెబుతుంటారని, అలాంటప్పుడు చిత్రపరిశ్రమను హింసించవద్దని ముఖ్యమంత్రికి ఆయన విన్నవించాలని పవన్కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై మోహన్బాబు ఆదివారం స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు పూర్తయిన తర్వాత పవన్కల్యాణ్ అడిగిన ప్రతి మాటకు తాను సమాధానం చెబుతానని మోహన్బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదలచేశారు. ‘ప్రస్తుతం ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాడు. అక్టోబరు 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతా. ఈ లోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని..నీ అమూల్యమైన ఓటును నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి అతడి ప్యానల్కి వేసి వాళ్లను గెలిపించమని కోరుతున్నా’ అని మోహన్బాబు తన ప్రకటనలో పేర్కొన్నారు. మోహన్బాబు ప్రకటన తెలుగు చిత్రసీమలో ఆసక్తినిరేపుతున్నది.