హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కార్మికులు తలపెట్టిన సమ్మెపై రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సినీ కార్మికులతో చర్చలు జరిపి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్కు మంత్రి తలసాని సూచించారు. ఆదర్శ్నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు.
రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కరించుకోవాలని, ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దని సూచించారు. సినీ కార్మికులలో అత్యధికంగా నిరుపేదలే ఉన్నారని, కరోనా సమయంలో షూటింగ్లు లేక అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సినీ కార్మికుల రెమ్యునరేషన్కు సంబంధించి మూడు సంవత్సరాలపాటు ఒప్పందం ఉంటుందని, కరోనా కారణంగా చిత్రపరిశ్రమ తీవ్ర ఇబ్బందులలో ఉన్నందున రెమ్యునరేషన్ పెంచే విషయమై ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులు గడువు కోరడం జరిగిందని పేర్కొన్నారు. ఆ గడువు ముగిసినందున తమ రెమ్యునరేషన్ పెంచాలని, ఇతర డిమాండ్లపై సినీ కార్మికులు సమ్మె చేపట్టిన విషయాన్ని మంత్రి వివరించారు.
కార్మికులు చేపట్టిన ఆందోళన ఉధృతం కాకముందే సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు.