చిత్తూరు, మే 21: భారతదేశంలో అగ్రశ్రేణి ఎఫ్ఎంసీజీ కంపెనీలలో ఒకటైన హెచ్సీసీబీ, జర్మనీ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న ఎవర్ఫ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కోవిడ్–19తో జరుగుతున్న పోరాటంలో మద్దతును అందిస్తూ అందజేసింది. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను చిత్తూరు జిల్లా ఆరోగ్య, వైద్య శాఖాధికారి డాక్టర్ పెంచలయ్యకు అందజేశారు.ఈ తోడ్పాటును హెచ్సీసీబీ (హిందుస్తాన్ కోకా కోలా బేవరేజస్) దేశవ్యాప్త కోవిడ్ కేర్ ప్లాన్లో భాగంగా అందజేశారు.
ఈ కోవిడ్ కేర్ ప్లాన్లో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లు, ఉచితంగా ఆహార పొట్లాలు, శీతల పానీయాలను అవసరార్థులకు పంపిణీ చేయడం, ఐసీయు, ఇతర అత్యవసర వైద్య యంత్ర సామాగ్రిని ప్రభుత్వ,చారిటబుల్ ఆస్పత్రులకు విరాళంగా అందించడంతో పాటుగా టీకా శిబిరాలు, మద్దతుకార్యక్రమాలకు తోడ్పాటునందించడం చేయనున్నారు. దేశంలో పలు ప్రాంతాలలో ఇప్పటికే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను హెచ్సీసీబీ పంపిణీ చేసింది. తద్వారా తగినంత ఆక్సిజన్ సరఫరా లేక సతమతవుతున్న కమ్యూనిటీకి తోడ్పాటునందిస్తుంది.
హెచ్సీసీబీ చీఫ్ పబ్లిక్ ఎఫైర్స్ అండ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ కమలేష్ శర్మ మాట్లాడుతూ ‘‘ తీవ్ర ఆరోగ్య సంక్షోభంతో దేశం పోరాడుతున్న వేళ సమాజానికి తోడ్పాటునందించేందుకు తగిన అవకాశం తమకు దక్కడం ఓ అదృష్టంగా భావిస్తున్నాం. మునిచ్లోని భారతీయ రాయబార కార్యాలయానికి మేము ఈ సందర్భంగా ధన్యవాదములు తెలుపుతున్నాము. జర్మనీ నుంచి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సమీకరించుకునేందుకు వారు ఎంతగానో తోడ్పడ్డారు. నెమ్మదిగానే అయినా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్రం తగిన చర్యలు తీసుకోవడంలో చక్కటి పురోగతి చూపుతుంది. ఈ కారణం చేత వీలైనంత ఎక్కువ మందికి టీకాలను అందించడంపై తాము దృష్టి కేంద్రీకరించామని అన్నారు.