కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా ‘మీటర్’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మించారు. రమేష్ కాదూరి దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు రమేష్ కాదూరి. ఆయన మాట్లాడుతూ…‘మాది ఏపీలోని విజయనగరం. సినిమాల మీద ఆసక్తితో పరిశ్రమకు వచ్చాను. దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాను. ముందు ఈ కథతో ముగ్గురు హీరోలను సంప్రదించాను. వారికి అప్పటికే ఒప్పుకున్న సినిమాలు ఉండటంతో కిరణ్ అబ్బవరంను ఎంచుకున్నాను. ఆయన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కిరణ్కు ఈ కథ కొత్తగా ఉంటుందనిపించింది. ఈ కథలో హీరోయిజానికి, భావోద్వేగాలకు, ప్రేమకు ఒక కొలత ఉంటుంది.
అందుకే సినిమాకు ‘మీటర్’ అనే టైటిల్ పెట్టాం. నాకు వ్యక్తిగతంగా ఊపు మీదుండే కమర్షియల్ చిత్రాలు ఇష్టం. కిరణ్ అబ్బవరం కెరీర్లో ఇప్పటిదాకా ఇలాంటి పాత్రలో నటించలేదు. పోలీస్ అధికారిగా ఆయన పర్మార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థంలో పది నిమిషాల పాటు తన జోరు చూపిస్తాడు. పాట, ఫైట్ ఫార్మేట్లో సినిమా ఉండదు. కమర్షియల్ దారిలోనే వెళ్లినా సినిమా అంతా వైవిధ్యంగా ఉంటుంది. తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంట్ మెప్పిస్తుంది. ఈ భావోద్వేగాలతో పాటు వినోదం, ప్రేమ వంటి అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. రెండు తమిళ చిత్రాల్లో అతుల్య రవి నటన చూసి ఆమెను ఎంపిక చేశాం. తన పాత్రకు పేరొస్తుంది. కథ డిమాండ్ మేరకు ఖర్చు పెట్టే నిర్మాతలు దొరకడం నా అదృష్టం. చెర్రీ, రవి, నవీన్కు కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా నా కొత్త సినిమా ఏదీ ఖరారు చేసుకోలేదు’ అని చెప్పారు.