మెర్రీ క్రిస్మస్
నెట్ఫ్లిక్స్: మార్చి 8
తారాగణం: విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్, రాధికా ఆప్టే తదితరులు
దర్శకత్వం: శ్రీరామ్ రాఘవన్
OTT | తమిళ నటుడు విజయ్ సేతుపతికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ‘విక్రమ్’, ‘జవాన్’ చిత్రాలతో హిందీలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. సేతుపతి బాలీవుడ్ నటి కత్రినాకైఫ్తో జోడీ కట్టాడంటే మంచి అంచనాలే ఉంటాయి. వీరిద్దరి కాంబోలో సంక్రాంతికి తమిళం, హిందీ భాషల్లో విడుదలైన సినిమా ‘మెర్రీ క్రిస్మస్’. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో మంచి స్ట్రీమింగ్ సొంతం చేసుకుంటున్నది. తమిళం, హిందీతోపాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఉంది. ఇక కథలోకి వెళ్తే.. ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) ఓ హత్య కేసులో ఏడేండ్లు జైలుశిక్ష అనుభవిస్తాడు. సత్ప్రవర్తన కారణంగా ముందుగానే విడుదల అవుతాడు.
జైలు నుంచి ముంబయి నగరానికి వస్తాడు. నగరమంతా క్రిస్మస్ సందడి నెలకొని ఉంటుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటే తోచక ఓ హోటల్కు వెళ్తాడు ఆల్బర్ట్. అక్కడ అతనికి మరియా (క్రతినాకైఫ్) పరిచయం అవుతుంది. భర్త జెరోమీతో ఆమెకు విభేదాలు ఉంటాయి. తన కూతురి విషయంలో భర్త తీరు నచ్చదు. ఒంటరిగా ఫీలవుతున్న మరియాకు తొలిపరిచయంలోనే ఆల్బర్ట్పై ఇష్టం కలుగుతుంది. తనతో డేట్కు రావాల్సిందిగా అతణ్ని ఇంటికి ఆహ్వానిస్తుంది. కూతుర్ని పడుకోబెట్టి ఇద్దరూ బయటికి వెళ్తారు. మళ్లీ ఇంటికి వచ్చేసరికి మరియా భర్త జెరోమీని ఎవరో షూట్ చేసి చంపేస్తారు.
మరియా పోలీసులకు ఫోన్ చేయాలని అనుకుంటుంది. కానీ, ఆల్బర్ట్ ఆమెకు తన గతం చెబుతాడు. తనతో ఆమెను చూస్తే పోలీసులు అనుమానిస్తారనీ, అది ఆమెకే ప్రమాదమనీ చెబుతాడు. ఆల్బర్ట్ను ఇంటినుంచి వెళ్లిపోమంటుంది మరియా. తర్వాత రోనీ అనే మరో వ్యక్తిని మరియా ఇంటికి తీసుకొస్తుంది. ఇంతకీ మరియా ఇంట్లో ఏం జరిగింది? జెరోమీది హత్యా, ఆత్మహత్యా? ఆల్బర్ట్ గతం ఏమిటి? రోజీని (రాధికా ఆప్టే) ఎందుకు చంపాడు? మరియా కోసం ఆల్బర్ట్ ఏం చేశాడన్నది మిగిలిన కథ.