‘మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్ని మరచిపోతున్న తరుణంలో ‘నాట్యం’ వంటి కళాత్మక చిత్రం రావడం సంతోషంగా ఉంది. ఈ గొప్ప ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అన్నారు అగ్ర నటుడు చిరంజీవి. ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకుడు. నిశ్రింకళ ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 22న ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్రాన్ని ఇటీవల చిరంజీవి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా అద్భుతమైన అనుభూతిని కలిగించింది. నాట్యం అంటే లయబద్దంగా కాళ్లు, చేతులను కదిలించడం కాదు…ఓ కథను దృశ్యరూపంలో అందంగా ఆవిష్కరించడమని చూపించారు. కళాత్మక అంశాన్ని చక్కటి వినోదప్రధానంగా ఆవిష్కరించారు. ఇలాంటి చిత్రాలు చూస్తుంటే విశ్వనాథ్గారు గుర్తుకొస్తారు. కళలు, నాట్యం పట్ల గొప్ప అనురక్తితో సినిమాలు తీశారాయన. ధనార్జన కోసం కాకుండా కళల పట్ల అంకితభావంతో సంధ్యారాజు ఈ సినిమా తీయడం అభినందనీయం. ఈ సినిమా ద్వారా నాట్యం గొప్పదనం కొన్ని కోట్ల మందికి చేరుతుంది. ‘శంకరాభరణం’ తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్గా నిలిచిపోయింది. అదే కోవలో ‘నాట్యం’ ప్రజాశీస్సులు పొందాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘నాట్యం జనాల మెప్పుని తీసుకొస్తుందని నా జీవితాన్ని నాట్యానికే అంకితం చేశాను. మా సినిమాకు చిరంజీవిగారి ఆశీస్సులు దొరకడం ఆనందంగా ఉంది’ అని సంధ్యారాజు చెప్పింది. తెలుగుదనం ఉట్టిపడే సినిమా ఇదని, నాట్యంతో పాటు మన సంస్కృతి గురించి కూడా చర్చించామని దర్శకుడు రేవంత్ తెలిపారు.