Chiranjeevi | తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలకు ఈ రోజు శుభం కార్డు పడిందని సంతోషంతో చెప్తున్నాం అని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు తమను ఆహ్వానించిన సీఎం జగన్కు ఇండస్ట్రీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. తక్కువ ధరకు ప్రజలకు వినోదం అందాలనేది సీఎం ఉద్దేశం. సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం నిర్ణయం మమ్మల్ని అందర్నీ సంతోషపరిచింది. ఈ నెలఖారులోనే జీవో వస్తుందని భావిస్తున్నాను అని చిరంజీవి తెలిపారు.
సీఎం జగన్ చిన్న సినిమాల మీద దృష్టి సారించారు. ఈ సినిమాలు కూడా విజయవంతం కావాలనే ఉద్దేశంతో.. ఆయన మా అందరి కోరికను మన్నించి ఐదో షోకు అనుమతించారు. దీని వల్ల చిన్న నిర్మాతలకు, ఇతరులకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది అని చిరంజీవి పేర్కొన్నారు.
భారతదేశంలో మన తెలుగు సినిమాలను గొప్పగా చెప్పుకుంటున్నారు.. కీర్తిస్తున్నారు అని చిరంజీవి పేర్కొన్నారు. పెద్ద బడ్జెట్తో మన నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాలకు మంచి పేరు వస్తుంది. సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని ఎప్పటికప్పుడు చర్చలు జరిపి ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించారు. నాని తీసుకున్న చర్యల వల్లే సమస్యలకు శుభం కార్డు పడిందన్నారు.
తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిన మాదిరిగానే ఏపీలో అభివృద్ధి చెందాలని సీఎం జగన్ ఆకాంక్షించినట్లు చిరంజీవి తెలిపారు. దానికి కావాల్సిన అన్ని అవకాశాలను కలుగుజేస్తానని చెప్పారు. వైజాగ్ను షూటింగ్లకు అనుకూలంగా తీర్చిదిద్దుతామన్నారు. సినీ పరిశ్రమకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సీఎం చెప్పినట్లు చిరంజీవి స్పష్టం చేశారు.