సినిమాల పరంగా ఎంతో అద్భుతమైన కెరీర్ ఉన్న చిరంజీవికి.. మరిచిపోలేని చేదు జ్ఞాపకం రాజకీయాలు. అలవాటు లేని పాలిటిక్స్ లోకి వెళ్లి నవ్వుల పాలయ్యాడు మెగాస్టార్. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టడం.. అది దారుణంగా పరాభవం పాలవడం.. ఆ తర్వాత మూడేళ్లకే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం.. బదులుగా ఆయన కేంద్ర మంత్రి అవడం.. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. తన పదవీ కాలం ముగియగానే రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికి మళ్ళీ సినిమాల్లోకి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. గత ఆరేళ్లుగా కేవలం సినిమాలు తప్ప మరో ప్రపంచం లేనట్టు ఉన్నాడు మెగాస్టార్. ఇప్పుడైతే ఏకంగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు. మరో రెండు మూడు సినిమాలకు కథలు సిద్ధం చేయాలంటూ దర్శకులకు సూచించాడు చిరంజీవి. ఇలాంటి సమయంలో మళ్ళీ రాజకీయాల వైపు మెగాస్టార్ అడుగులు వేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే తాజాగా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో నరేంద్ర మోదీతో పాటు ఒకే వేదికను పంచుకున్నాడు మెగాస్టార్. సినిమా ఇండస్ట్రీ నుంచి ఈయనకు ప్రత్యేక ఆహ్వానం లభించింది. కేంద్ర ప్రభుత్వం అంత ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవిని ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానం పంపడం వెనుక మతలబు ఏంటి అంటూ ఆలోచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని బీజేపీకి మద్దతుగా నిలిపాడు. కమల దళానికి తాను ఎప్పుడూ అండగానే ఉంటానని చెప్పాడు పవన్ కళ్యాణ్. పైగా బీజేపీతో పొత్తు విషయంలో కూడా పవన్ చాలా క్లారిటీగా ఉన్నాడు.
ఇలాంటి సమయంలో చిరంజీవి.. నరేంద్ర మోదీతో కలిసి ఒక వేదికను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అభిమానులు అందరూ సపోర్ట్ చేయాలని.. జనసేన వెంట కార్యకర్తల్లా ఉండాలి అంటూ అభిమానులకు ఈ మధ్యే సూచించాడు చిరంజీవి. ఈ నేపథంలోనే చిరు అడుగులు బీజేపీ వైపు పడబోతున్నాయా అనే ఆసక్తికరమైన చర్చ కూడా ఇండస్ట్రీలో జరుగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీని బలపరచాలంటే కచ్చితంగా సినీ గ్లామర్ కూడా అవసరమే అని నమ్ముతుంది బీజేపీ.
ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి చిరంజీవిని పార్టీలోకి తీసుకుంటే మెగా బ్రదర్స్ అండదండలు ఉంటాయని కమలనాధులు నమ్ముతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే చిరంజీవి మాత్రం అలాంటిదేం లేదు.. తనకు రాజకీయాలు అవసరం లేదు కేవలం సినిమాలతో బిజీగా ఉంటానని సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్ళు రాజకీయాల్లోకి వెళ్లాను ఇక జీవితంలో మళ్లీ అటువైపు వెళ్ళను అంటున్నాడు మెగాస్టార్.