Chandrababu Naidu | ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. సీఎం ప్రమాణ స్వీకారంతో పాటు కూటమికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ వేడుకకు సినీ నటుడు పద్మవిభూషణ్ చిరంజీవి హాజరుకానున్నారు. ఏపీ స్టేట్ విశిష్ట అతిథిగా చిరంజీవి హాజరుకావాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా చిరు ఈరోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వేడుకకు చిరుతో పాటు రామ్ చరణ్ కూడా హాజరుకానున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ కార్యక్రమానికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ రానుండగా.. ప్రత్యేక అతిథిలుగా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.