Chiranjeevi | ఇప్పటి వరకు మెగా హీరోలు అందరూ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ తమ సినిమాల కోసం రీమిక్స్ చేశారు. కేవలం మెగా హీరోలు మాత్రమే కాదు అల్లరి నరేశ్, శివాజీ లాంటి బయట హీరోలు కూడా చిరంజీవి పాటలను రీమిక్స్ చేశారు. మగధీరలో బంగారు కోడిపెట్ట అంటూ రామ్ చరణ్ చేసిన డ్యాన్సులు ఇప్పటికీ హైలైట్ గా నిలుస్తాయి. ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించడంలో బంగారు కోడిపెట్ట పాత్ర కూడా ఎంతో కొంత ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా చిరంజీవి కూడా అతిథి పాత్ర చేయడం మగధీరకు బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత రచ్చ సినిమాలో వాన వాన వెల్లువాయే అంటూ తమన్నాతో మెగా వారసుడు చేసిన రొమాన్స్ అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు.
ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా మేనమామ పాటలను రీమిక్స్ చేశాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో ఖైదీ నెంబర్ 786 లోని గువ్వా గోరింక పాటకు స్టెప్పులేశాడు తేజు. అలాగే వివి వినాయక్ తెరకెక్కించిన ఇంటెలిజెంట్ సినిమాలో చమకు చమకు చాం అంటూ లావణ్య త్రిపాఠితో కలిసి చిందులేశాడు. ఇద్దరమ్మాయిలతో సినిమాలో అల్లు అర్జున్ గ్యాంగ్ లీడర్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో అన్నయ్య వీణ స్టెప్ దించేశాడు. ఇలా మెగా ఫ్యామిలీలో చిరంజీవి పాటలను ప్రతి ఒక్కరూ వాడుకున్నారు. కొత్త జంటలో కూడా అల్లు శిరీశ్ ఓ రీమిక్స్ చేశాడు. ఇలా చిరు పాటలను వాళ్లు వీళ్లు రీమిక్స్ చేయడంలో పెద్దగా వింత లేదు. కానీ తన పాటను తనే రీమిక్స్ చేస్తే..! ఐడియా అదిరిపోయింది కదా.
భోళా శంకర్ సినిమా కోసం ఇప్పుడు ఇదే జరగబోతుంది అని తెలుస్తోంది. మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కోల్కతా సెట్ వేశారు. అందులోనే మేజర్ పార్ట్ షూటింగ్ చేస్తున్నాడు మెహర్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చూడాలని ఉంది సినిమాలోని ఆల్ టైం క్లాసిక్ సాంగ్ రామ్మా చిలకమ్మ పాటను రీమిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్పుడు మణిశర్మ ఆ సినిమాకు సంగీతం అందిస్తే ఇప్పుడు భోళా శంకర్ కు ఆయన కొడుకు మహతీ స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
చూడాలని ఉంది సినిమా కూడా కోల్కతా బ్యాక్ డ్రాప్లో వచ్చింది. ఇప్పుడు మెహర్ రమేశ్ సినిమా కూడా కోల్ కత్తా నేపథ్యంలోనే వస్తుంది. సిచువేషన్ కలవడంతో రామ్మా చిలకమ్మా పాటను ఇందులో రీమిక్స్ చేశారని తెలుస్తోంది. చిరంజీవి కూడా ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులతో వింటేజ్ మెగాస్టార్ ను గుర్తు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే కాని నిజమైతే భోళా శంకర్ పై అంచనాలు మరింత పెరగడం ఖాయం. సినిమా సమ్మర్ తర్వాత విడుదల కానుంది. కీర్తి సురేశ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, కె ఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.