Chiranjeevi | పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్యను పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ క్రమంలో గడ్డం సమ్మయ్యను తన నివాసానికి ఆహ్వానించిన చిరంజీవి ఆయన్ను సన్మానించారు.అలాగే చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయన్ను సమ్మయ్య సత్కరించారు.
అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. అంతరించిపోతున్న చిందు యక్షగాన కళారూపానికి జీవం పోస్తున్న కళాకారుడికి పద్మశ్రీ రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇలాంటి కళారూపాలను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. కళలను, కళాకారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడుకోవాలని కోరారు. కాగా, చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి తనను ఇంటికి ఆహ్వానించి, సత్కరించడం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని గడ్డం సమ్మయ్య తెలిపారు.