ఒకప్పుడు పాజిటివ్ టాక్ వచ్చిందంటే సినిమాకు కలెక్షన్స్ నెమ్మదిగా అయినా వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టాక్ ఆడియన్స్ లోకి వెళ్లే లోపు చిన్న సినిమా థియేటర్ బయట ఉంటుంది. ఏం మ్యాజిక్ చేసినా కూడా మొదటి మూడు రోజుల్లోనే చేయాలి. ఆ తర్వాత కూడా థియేటర్లలో సినిమా ఉండాలి అంటే దానికి అదృష్టం ఉండాలి. అది ‘కాంతారా’ లాంటి ఒకటి రెండు సినిమాలకు మాత్రమే వర్కౌట్ అవుతుంది. అన్ని సినిమాలకు ఆ మ్యాజిక్ వర్కౌట్ అవ్వదు. సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘లవ్ టుడే’ లాంటి సినిమాలు కూడా నాలుగు రోజుల తర్వాత థియేటర్లలో చూద్దామంటే కూడా కనిపించలేదు.
‘లవ్ టుడే’ సినిమాకు మొదటి మూడు రోజుల్లోనే ఐదు కోట్ల షేర్ వచ్చింది. అలా బ్రేక్ ఈవెన్ ఇవ్వడమే కాకుండా లాభాల బాట పట్టింది. గతవారం అడివి శేష్ ‘హిట్ 2’తో పాటు విడుదలైన ‘మట్టి కుస్తీ’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. భార్యా భర్తల మధ్య చోటు చేసుకునే చిలిపి తగాదాలకు కుస్తీ పోటీలను నేపథ్యంగా ఎంచుకొని.. ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు చల్ల అయ్యావు. ఈ సినిమా కథ నచ్చిన మాస్ హీరో రవితేజ నిర్మాణంలో భాగమయ్యాడు. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన మట్టి కుస్తీ సినిమాకు టాక్ బాగానే రావడంతో.. కచ్చితంగా వీకెండ్ కలెక్షన్స్ బాగుంటాయని అందరూ అనుకున్నారు. అయితే మూడు రోజులకు కలిపి ఈ సినిమా కనీసం కోటి రూపాయల షేర్ కూడా వసూలు చేయకపోవడంతో రవితేజ.. బ్రాండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం వర్కౌట్ కాలేదని అర్థమవుతుంది.
గతంలో విష్ణు విశాల్ హీరోగా నటించిన ఎఫ్ఐఆర్ సినిమాకు కూడా తెలుగులో రవితేజ సమర్పకుడిగా ఉన్నాడు. ఈ సినిమాకు కూడా అద్భుతమైన టాక్ వచ్చింది కానీ.. కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఇప్పుడు మట్టి కుస్తీ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. కామెడీతో పాటు అద్భుతమైన మెసేజ్ ఉన్న ఈ సినిమా ఓటిటిలో అయితే బాగా వర్కవుట్ అవుతుంది అంటున్నారు విశ్లేషకులు. తెలుగులో కలెక్షన్స్ రాకపోయినా తమిళంలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. మొత్తానికి నిర్మాతగా రవితేజకు నిరాశ తప్పడం లేదు. ఓ వైపు నాని నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతుంటే.. మాస్ రాజా మాత్రం వెనుక బడుతున్నాడు.