చిత్ర పరిశ్రమలో ఎన్ని ట్రెండ్స్ వచ్చినా మాస్ ఎంటర్ టైనర్స్ స్థానం పదిలంగానే ఉంటుందని, అవెప్పుడూ ప్రేక్షకులకు బోర్ కొట్టవని అంటున్నారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. కేజీఎఫ్ 2 చిత్రంలో ప్రతినాయకుడు అధీరా క్యారెక్టర్ లో కనిపించబోతున్న సంజయ్ దత్.. బాలీవుడ్ హీరోయిజం ఉన్న సినిమాల గురించి మాట్లాడారు. యాక్షన్ స్టంట్స్, హీరోయిజం ఉన్న మాస్ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా దక్కుతుందన్నారు.
సంజయ్ దత్ మాట్లాడుతూ.. బాలీవుడ్ సినిమా తన మూలాలను వెతుక్కోవాలి. షోలే, జంజీర్, నేను నటించిన వాస్తవ్, ఖల్ నాయక్ లాంటి మాస్ ఎంటర్ టైనర్స్ చిత్రాలు రూపొందించాలి. హీరోయిజం, యాక్షన్ లది ఎవర్ గ్రీన్ ఫార్ములా. బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ హిట్స్ అన్నీ ఈ తరహా చిత్రాలే. అని చెప్పారు. కొత్త నటీనటుల్లో కావాల్సిన ఎనర్జీ, అంకితభావం ఉన్నాయని, వాళ్లతో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు సంజయ్ దత్. నటులు వయసుకు గౌరవం ఇవ్వాలని, వయసుకు తగిన పాత్రల్లో నటిస్తేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.