వయస్సు పెరుగుతున్నా తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నారు మన సీనియర్ హీరోలు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్,బాలకృష్ణ ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యింపజేస్తున్నారు. చిరంజీవి విషయానికి వస్తే కొన్నేళ్లుగా ఆయన ఆచార్య సినిమాతో బిజీ ఉన్నారు. కరోనా మహమ్మారి వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇది పూర్తయ్యాక లూసిఫర్ రీమేక్ చేయనున్నారు.
లూసిఫర్ రీమేక్ చిత్రాన్ని తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్లో చేయనున్న చిరు ఈ సినిమాతో పాటుగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదాళం రీమేక్ చేయనున్నారు. వీటితో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నానని గతంలోనే ప్రకటించారు. ఇందులో చిరు డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం.
తాజాగా చిరంజీవి మరో యంగ్ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చాడనే ప్రచారం జరగుతుంది. ఇటీవల విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతి మెగాస్టార్ కు ఒక కథ వినిపించాడట. చిరుకి ఆ హిలేరియస్ ఎంటర్టైనర్ బాగా నచ్చేయడంతో వెంటనే పచ్చ జెండా ఊపేసినట్లు సమాచారం. మారుతి ఎప్పటినుండో మెగాస్టార్ తో పనిచేయాలనుకుంటున్నాడు. ఆ కల ఈ సినిమాతో తీరనుందని అంటున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. త్వరలోనే అధికారిక సమాచారం వస్తుందని తెలుస్తోంది