Pradeep Patwardhan Passes Away | మరాఠి ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మరాఠి లెజెండరీ నటుడు ప్రదీప్ పట్వర్థన్(65) కన్నుమూశాడు. మంగళవారం ఉదయం ముంబైలోని తన నివాసంలో ప్రదీప్ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో మరాఠి చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ‘చష్మే బహద్దర్’, ‘ఏక్ శోద్’, ‘శివాజిరాజే భోసాలే భోల్టోయ్’, ‘డాన్స్ పార్టీ’, ‘ఏక్ ఫుల్ ఛార్ హాఫ్’ వంటి సినిమాలతో మరాఠి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన మృతి పట్ల పలువురు సెలబ్రెటీలు దిగ్భాంతి వ్యక్తం చేశారు.
ప్రదీప్ మృతి పట్ల మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంతాపం ప్రకటించాడు. ఏక్నాథ్ షిండే ట్విట్టర్లో ‘ప్రదీప్ పట్వార్థన్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాంటి గొప్ప నటుడు హఠాన్మరణం చెందడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. మరాఠి సినీ పరిశ్రమ ఓ లెజెండరి నటుడిని కోల్పోయింది’ అంటూ పేర్కొన్నాడు. ప్రదీప్ పట్వర్థన్ అంత్యక్రియలు మధ్యాహ్నం 3 గంటలకు గిర్గవ్లో జరుగనున్నాయి. ఈయనకు భార్య, కొడుకు ఉన్నారు.