ఇటీవల జోరు తగ్గించింది మలయాళీ భామ అనూ ఇమ్మాన్యుయేల్. గతేడాది బెల్లంకొండ శ్రీనివాస్తో ‘అల్లుడు అదుర్స్’, శర్వానంద్ మూవీ ‘మహా సముద్రం’లో నటించిందీ తార. ఆ రెండు చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. రెండేళ్లు పాండమిక్ రావడం కూడా ఆమె నట ప్రయాణానికి స్పీడ్ బ్రేకర్ అయ్యింది. దీంతో మళ్లీ తొలి మెట్టు నుంచీ కెరీర్ నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ నాయిక తిరిగి పుంజుకుంటున్నది.
తెలుగులో రెండు చిత్రాలతో తెరపైకి రాబోతున్నది. అల్లు శిరీష్ సరసన నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ రిలీజ్కు రెడీ అవుతుండగా…సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది అనూ. ఈ రెండు సినిమాలతో పాటు మరో తమిళ ప్రాజెక్ట్ ఆమెకు దక్కినట్లు సమాచారం. కార్తి హీరోగా దర్శకుడు రాజు మురుగన్ రూపొందించనున్న సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ నాయికగా ఎంపికైందని తెలుస్తున్నది. పొన్నియన్ సెల్వన్ సూపర్ హిట్ తర్వాత కార్తి స్టార్ డమ్ మరింత పెరిగిన నేపథ్యంలో ఆ క్రేజ్ అనూకు కలిసిరానుంది.