టాలీవుడ్ యంగ్ హీరో ప్రస్తుతం వైవిధ్యమైన చిత్రాలు ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో ‘మేజర్’ అనే సినిమా చేస్తున్నాడు. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మహేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా వలన సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉండగా, వచ్చే ఏడాది మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మేజర్ సినిమా ప్రయాణంలో అడవి శేష్ .. సందీప్ ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. ఇటీవల సందీప్ ఫ్యామిలీతో కలిసి వెళ్లి నివాళులు అర్పించాడు. అయితే తాజాగా అడివి శేష్కి .. సందీప్ తల్లి స్పెషల్ గిఫ్టును ఇచ్చారు. ఈ విషయాన్ని శేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మదర్ ధనలక్ష్మి ఆంటీ దీన్ని (టీషర్ట్) నాకు గిఫ్టుగా ఇచ్చారు. ఈరోజు ఈ టీషర్ట్ను ధరించాను’ అని రాసుకొచ్చాడు. అలాగే, టీషర్ట్ వేసుకున్న ఫొటోను కూడా షేర్ చేశాడు.
మేజర్ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జి మహేష్బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. శోభిత దూళిపాళ్ల కీలక పాత్రను చేస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.