SSMB28 Movie Latest Update | సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలుంటాయి. ఆ కాంబోలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు, సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో మహేష్-త్రివిక్రమ్ ఒకటి. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘అతడు’, ‘ఖలేజా’ కల్ట్ క్లాసిక్ చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాలు కమర్షియల్గా అంతగా సక్సెస్ సాధించకోపోయినా బుల్లితెరపై మాత్రం ఘన విజయం సాధించాయి. ఇప్పటికీ ఈ రెండు చిత్రాలు టీవీలో వస్తున్నాయంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. తినగా తినగా వేప తియ్యనుండు అనే విధంగా ఈ రెండు చిత్రాలు చూసిన ప్రతిసారి ఇంకా ఇంకా నచ్చుతూనే ఉంటాయి. ఇక దాదాపు 12ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి #SSMB28తో హ్యట్రిక్కు రెడీ అవుతున్నారు.
ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్లో సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఇటీవలే మహేష్బాబు కూడా ఈ మూవీ కోసం వర్కవుట్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కాగా ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.