అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా రెండో షెడ్యూల్ మరో రెండు మూడు రోజుల్లో మొదలయ్యేది. కానీ అనుకోకుండా వారం రోజుల కింద మహేష్ బాబు అమ్మగారు ఇందిరా దేవి అనారోగ్యంతో మరణించడంతో ఒక్కసారిగా ప్లాన్స్ అన్ని మారిపోయాయి. అన్నయ్య రమేష్ బాబు పోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న మహేష్ బాబుకు అమ్మ మరణం మరింత కృంగ తీసింది. ఘట్టమనేని కుటుంబానికి కూడా ఇది గట్టి దెబ్బ. ఇక సూపర్ స్టార్ కృష్ణను చూసి అభిమానులు మౌనంగా రోదిస్తున్నారు. మూడేళ్ల కింద ఆయన మొదటి భార్య విజయ నిర్మల చనిపోయారు.. 2022 మొదట్లో పెద్ద కొడుకు రమేష్ బాబును పోగొట్టుకున్నారు.. ఇప్పుడు పెద్ద భార్య చనిపోవడంతో ఆయన లో లోపలే కుంగిపోతున్నారు.
మరోవైపు మహేష్ కూడా ఇప్పటికీ అమ్మ పోయిన బాధ నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఈ మధ్యే గంగా నదిలో అమ్మ ఆస్తికలు నిమజ్జనం చేసిన ఈయన.. మరికొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్ కూడా మహేష్ బాబుకు సపోర్టుగా నిలుస్తూ.. ఆయనకు తగ్గట్టుగా షెడ్యూల్స్ ను అడ్జస్ట్ చేస్తున్నాడు. దాంతో ఇప్పట్లో మహేష్ కెమెరా ముందుకు రావడం కాస్త కష్టమే అనిపిస్తుంది. ముందు ప్లాన్ చేసిన దాని ప్రకారం అయితే దసరా తర్వాత రెండో షెడ్యూల్ అనుకున్నారు. దీని మీద అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.
అక్టోబర్ 10 నుంచి హైదరాబాదులోనే మహేష్, పూజ హెగ్డే సహా సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు దర్శకుడు త్రివిక్రమ్. కానీ ఇందిరా దేవి దశదిన కర్మ అయిపోయిన తర్వాత కనీసం మరో వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని నిశ్చయించుకున్నాడు మహేష్. అందుకే అక్టోబర్ మూడో వారంలో SSMB 28 నెక్స్ట్ షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. 2023 ఏప్రిల్ 28న సినిమా విడుదల కానుంది.