సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబంలో విషాదం అలుముకుంది. మహేశ్ సోదరుడు రమేశ్ బాబు శనివారం రాత్రి మృతిచెందారు. దీంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వార్త విని సంతాపం వ్యక్తం చేశారు. అయితే సోదరుడి అంత్యక్రియలకు మహేశ్ బాబు దూరమయ్యారు.
ఇటీవలే మహేశ్కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఈ క్రమంలో సోదరుడి మృతిపై భావోద్వేగానికి గురవుతూ ఒక ట్వీట్ చేశారు. అన్నయ్యతో తనకున్న అనుబంధాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు.
‘‘నాకు స్ఫూర్తి, బలం, ధైర్యం అన్నీ నువ్వే. నువ్వు లేకుంటే నేనిప్పుడు ఉన్న వ్యక్తిలో సగం కూడా అయ్యుండేవాడిని కాదు. నాకోసం నువ్వు ఎంతో చేశావు. దానికి ధన్యవాదాలు. ఇక విశ్రాంతి తీసుకో. ఈ జీవితంలో, నాకంటూ మరో జన్మ ఉంటే అందులో కూడా ఎల్లప్పుడూ నువ్వు నాకు అన్నయ్యవే. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’’ అంటూ తన అన్నయ్య ఫొటోతో పాటు ఒక పోస్టు పెట్టారు.
ఇటీవలే నూతన సంవత్సర వేడుకల కోసం మహేశ్ బాబు కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అనంతరం తాజాగా ఆయనకు కరోనా సోకింది. దీంతో అన్నయ్య అంత్యక్రియలకు ఆయన దూరంగా ఉండాల్సి ఉంది.