Mahesh Babu | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో మహేష్బాబుతో రాజమౌళి తెరకెక్కించబోతున్న పాన్ వరల్డ్ సినిమా విశేషాల గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్బాబు తొలి పాన్ ఇండియా చిత్రమిదే కావడం ఆయన అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఓ సాహస వీరుడి కథగా ఈ సినిమాను తెరకక్కించబోతున్నారని సమాచారం.
జంగిల్ అడ్వెంచరస్ మూవీగా హాలీవుడ్ స్థాయి హంగులతో తీర్చిదిద్దబోతున్నారని , ఈ సినిమాకు దాదాపు 1000కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేసినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై కెఎల్ నారాయణ నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాణంలో మరికొందరు భాగస్వాములయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓ దిగ్గజ ఓటీటీ సంస్థ కూడా ఈ సినిమా ప్రొడక్షన్లో పాలుపంచుకోవాలనే ఆలోచనతో ఉందట. అయితే ఈ వార్తలన్నీ సోషల్ మీడియా వేదికగా ప్రచారంలో ఉన్నవేనని, వీటిలో వాస్తవమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందేనని అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను దర్శకుడు రాజమౌళి త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.