Mahesh Babu | ఇండస్ట్రీలో ఒక సినిమా మంచి విజయం సాధిస్తే, ఆ హీరో, దర్శకుడి కాంబోలో మరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అన్ని కుదిరితే ఆ హీరో, దర్శకుడు కూడా సినిమాను చేయడానికి సిద్ధంగా ఉంటారు. టాలీవుడ్లో ఇప్పటికే అలా ఒక సినిమాతో జర్నీ ఆపకుండా.. రెండు మూడు సినిమాలతో జర్నీ కంటిన్యూ అయిన హీరో, దర్శకుల కాంబోలో ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబో రెండవ సినిమాను చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ కాంబో ఎవరా అని ఆలోచిస్తున్నారా? వారెవరో కాదు మహేష్బాబు, అనీల్ రావిపూడి.
వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మహేష్ కెరీర్లోనే అత్యంత భారీ కలెక్షన్లు సాధించిన చిత్రంగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది. కాగా తాజాగా మరో సారి ఈ కాంబో సెట్స్పైకి వెళ్ళనున్నట్లు అనీల్ రావిపూడి స్వయంగా తాజాగా జరిగిన మీడియా ఇంటర్వూలో తెలిపాడు. ‘మహేష్బాబుతో నాకు మంచి అనుబంధం ఉంది. మరోసారి ఇద్దరం కలిసి సినిమా చేయబోతున్నాం. మహేష్ బాబు కోసం మంచి స్క్రిప్ట్ను చేస్తున్నాను. ప్రస్తుతం మహేష్ బాబు కమిట్మెంట్స్ అన్ని పూర్తైయ్యాక అనీల్ సినిమా స్టార్ట్ చేద్దామా అని మహేష్ చెప్పగానే ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. అప్పటిలోగా నేను బౌండెడ్ స్క్రిప్ట్తో రెడీగా ఉండాలని’ అనీల్ రావిపూడి వెల్లడించాడు.
ప్రస్తుతం అనీల్ రావిపూడి ‘ఎఫ్-3’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ‘ఎఫ్-2’కు సీక్వెల్గా తెరకెక్కింది. ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఇక మహేష్ ప్రస్తుతం నటించిన సర్కారు వారి పాట మే 12న విడుదల కానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాతే అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది.