Mahavatar Narsimha | చిన్న సినిమాగా సైలెంట్గా విడుదలైన ‘మహావతార్ నరసింహ’ అంచనాలకు అందని స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన రోజునుంచే పాజిటివ్ మౌత్టాక్తో దూసుకుపోతూ, థియేటర్లలోనే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. యానిమేటెడ్ సినిమా కావడం, ఏ విధమైన భారీ ప్రమోషన్ లేకపోయిన కేవలం మౌత్టాక్తో ఈ చిత్రం మెగా బ్లాక్బస్టర్గా నిలిచింది. అనంతరం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన తర్వాత కూడా రికార్డు స్థాయి వ్యూస్తో మరోసారి తన సత్తా చాటుకుంది. ఇప్పుడు ఈ చిత్ర విజయం మరింత పెరిగింది. ప్రతిష్టాత్మక 98వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ దశకు ‘మహావతార్ నరసింహ’ అర్హత సాధించింది. ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన ఈ పురస్కారం కోసం పోటీ పడుతున్న 35 యానిమేటెడ్ సినిమాల్లో ఇది ఒకటి.
ఫైనల్ నామినేషన్స్ జనవరి 22, 2026న ప్రకటించనుండగా… భారతీయ సినీ అభిమానులంతా ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఫైనల్ నామినేషన్లోకి చేరితే, ఆస్కార్లో నామినేషన్ పొందిన మొదటి భారతీయ యానిమేటెడ్ ఫిల్మ్గా చరిత్ర సృష్టిస్తుంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించారు. నరసింహ పురాణం, విష్ణు పురాణం, శ్రీమద్భాగవతం ఆధారంగా సాగిన కథను ఆధునిక యానిమేషన్తో చూపించడం చిత్రానికి ప్రధాన ప్రత్యేకత. పురాణాల్లోని వైభవం, నరసింహ అవతారం యొక్క శక్తి–భావనలను గ్రాఫికల్గా అద్భుతంగా చూపించిందని ప్రేక్షకులు ప్రశంసించారు.
మరోవైపు, దర్శకుడు నీరజ్ ఘయ్వాన్ రూపొందించిన ‘హోంబౌండ్’ ఇప్పటికే భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపికై బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో పోటీ పడుతోంది. ఇలా రెండు వేర్వేరు కేటగిరీల్లో భారత సినిమాలు ప్రపంచ వేదికపై బరిలో నిలవడం సినీ ప్రేమికులకు గర్వకారణం. ఫైనల్ నామినేషన్స్: జనవరి 22, 2026న కాగా, ఆస్కార్ అవార్డ్స్ వేడుక: మార్చి 15, 2026న జరగనుంది. థియేటర్లలోనూ, ఓటీలోనూ అదరగొట్టిన ‘మహావతార్ నరసింహ’ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాకు గుర్తింపు తెచ్చే అవకాశాన్ని అందుకుంది. ఈ యానిమేటెడ్ అద్భుతం ఫైనల్ నామినేషన్ వరకు చేరుతుందా? ఆస్కార్ వేదికపై భారతీయ యానిమేషన్ చరిత్ర సృష్టిస్తుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.