Madhuri Dixit Birthday | బాలీవుడ్ అందాలతార మాధురీ దీక్షిత్. అందం, అభినయంతో ఇంకా సినీ ప్రియులను అలరిస్తున్నది. ముఖ్యంగా మాధురీ నాట్యం కోసం థియేటర్లకు జనాలకు క్యూ కట్టేవారు. సినిమాల్లోకి ప్రవేశించి దాదాపు 37 సంవత్సరాలు దాటింది. నేడు ఈ బ్యూటీ 56వ పుట్టిన రోజును జరుపుకుంటున్నది. సినీ పరిశ్రమలో నటనతో పాటు డ్యాన్స్తోనూ అలరించి ‘ధక్-ధక్ గర్ల్ ఆఫ్ బాలీవుడ్’ నిలిచింది. తేజాబ్’ చిత్రంలోని ఏక్ దో తీన్ పాట ఎప్పుడు విన్నా మనసు ఉరకలెత్తుతుంది. మాధురీ దీక్షిత్ ఆయా పాటలకు మాధురి డాన్స్ మూమెంట్స్ కళ్ల ముందు ఇంకా మెదులుతూనే ఉంటాయి. అలాగే ఖల్నాయక్ చిత్రంలో ‘చోళీ కే పీచే’ పాటపై సైతం అందచందాలు, డాన్స్తో యూత్ను ఆ సయంలో మెస్మరైజ్ చేసింది. అయితే, ఈ పాట ప్రసారాన్ని దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో నిషేధించింది. దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం రండి..!
‘ఖల్నాయక్’ చిత్రంలోని ‘చోళీ కే పీచే’ పాటపై మాధురీ దీక్షిత్ నర్తించింది. 1993లో ‘ఖల్నాయక్’ విడుదలైన చిత్రంలో ఈ పాట భారీ హిట్ను సొంతం చేసుకుంది. ఈ పాట కోసమే ఒకే వారంలో కోటిపైగా క్యాసెట్లు అమ్ముడయ్యాయి. ఇంతటి హిట్ సాధించిన పాటను మాత్రం దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియా ప్రసారాన్ని బ్యాన్ చేశాయి. ‘చోలీ కే పీచే’ పాటలో సాహిత్యం బోల్డ్గా ఉండడంతో పాటు వివాదాస్పదంగా ఉందని విమర్శలు వచ్చాయి. స్త్రీలోని కోరికలను వ్యక్తపరిచేలా ఉందని, పాటలోని సాహిత్యమంతా మరీ అశ్లీలంగా ఉందని విమర్శలు ఆరోపణలున్నాయి. దాంతో దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ఈ పాటను నిషేధించాయి. అయితే, ఆ సమయంలో మాధురి పాటను చూసేందు కోసమే జనాలు థియేటర్కు వెళ్లడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. మాధురి దీక్షిత్ మూడేళ్ల వయసులోనే నాట్యం చేయడం మొదలుపెట్టింది. ప్రతిభను గురించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు కథక్లో శిక్షణ తీసుకున్నది. చదువుకొనే రోజుల్లోనే మాధురీ దీక్షిత్ ఆటపాటల్లోనూ రాణించింది. స్కూల్ డే, కాలేజ్ డే ఎక్కడైనా మాధురీ నృత్యం తప్పనిసరిగా ఉండేది. మైక్రోబయాలజీలో బీఎస్సీ చేస్తున్న సమయంలోనే సినీరంగ ప్రవేశం చేసింది. 1984లో ‘అబోధ్’లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
అయితే, సినిమా పెద్దగా ఆడకపోయినా మాధురికి మాత్రం మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ‘ఉత్తర్ దక్షిణ్’, ‘మోహ్రే’ చిత్రాల్లో నటించారు. అనిల్కుపూర్ హీరోగా ఎన్ చంద్ర తెరకెక్కించిన ‘తేజాబ్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా నిలిచింది. ఈ చిత్రంలోని ‘ఏక్ దో తీన్’ పాటపై మాధురీ దీక్షిత్ చేసిన డ్యాన్స్ కుర్రకారును గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత సంజయ్ దత్ ‘సాజన్’, ’ఖల్ నాయక్’, సల్మాన్ ఖాన్తో ‘హమ్ ఆప్ కే హై కౌన్’, షారుఖ్ ఖాన్తో ‘దిల్ తో పాగల్ హై’ తదితర సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. చివరిసారిగా 2022లో వచ్చిన ‘మజా మా’ చిత్రంలో కనిపించింది.