సన్నీ నవీన్, సీమాచౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మధుర వైన్స్’. జయకిషోర్ బండి దర్శకుడు. రాజేష్ కొండెపు, సృజన్ ఎరబోలు నిర్మాతలు. ఈ నెల 22న విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో సందీప్కిషన్ మాట్లాడుతూ ‘లఘు చిత్రాల నేపథ్యమున్న దర్శకులంతా వినూత్నమైన కథాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఆ కోవకు చెందిన చిత్రమిది’ అని తెలిపారు. కల్ట్ సినిమా ఫీల్ను ట్రైలర్ కలిగిస్తున్నదని దర్శకుడు బుచ్చిబాబు సానా పేర్కొన్నారు. ‘ప్రేమ, యాక్షన్ అంశాల కలబోతగా రూపొందుతున్న చిత్రమిది. జీవితాన్వేషణలో ఓ యువకుడు తెలుసుకున్న సత్యాలేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సన్నీనవీన్, వివేక్ కూచిభోట్ల తదితరులు పాల్గొన్నారు.