సొట్టబుగ్గలతో, క్యూట్ స్మైల్తో ఓ తరం అమ్మాయిలను ఫిదా చేసిన నటుడు మాధవన్. కమర్షియల్ పంథాకు భిన్నంగా ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. కథ నచ్చితే, పాత్ర నప్పుతుంది అనిపిస్తే సెకండ్ హీరో క్యారెక్టర్కు కూడా ఓకే చెబుతుంటాడు. ఓటీటీలోనూ తనదైన విజయాలు సాధిస్తున్న మాధవన్ తాజాగా ‘ద రైల్వే మెన్’ వెబ్సిరీస్లో కీలక పాత్ర పోషించాడు. 1984 భోపాల్ గ్యాస్ ఉదంతంపై ఓటీటీకెక్కిన ఈ వెబ్సిరీస్లో సెంట్రల్ రైల్వే జీఎమ్గా నటించాడు. ఈ సందర్భంగా వెబ్సిరీస్ ముచ్చట్లతోపాటు సినీకబుర్లనూ ఆయన ఇలా పంచుకున్నాడు..
‘ద రైల్వే మెన్’ వెబ్సిరీస్ ఒప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మించడం ఒకటైతే.. ఒక వాస్తవిక గాథ ఆధారంగా రూపొందుతున్న సిరీస్ కాబట్టి వెంటనే ఓకే చెప్పాను. నా పాత్ర నిడివి గురించి అంతగా ఆలోచించలేదు. భోపాల్ ట్రాజెడీని ఎలా మర్చిపోగలం? ఆ రోజు జరిగిన దుర్ఘటన ఎన్ని దశాబ్దాలు గడిచినా గుర్తుంటుంది. అలాంటి ఒక కథాంశంలో నటించే అవకాశం రావడాన్ని చాలెంజ్గా తీసుకుంటాను. ఆ సమయంలో మనుషుల భావోద్వేగాలను అనుభూతి చెందడం, పాత్ర ద్వారా పలికించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ విషయంలో మా టీమ్ అంతా విజయవంతం అయ్యిందని భావిస్తున్నా!
వాస్తవ సంఘటన ఆధారంగా నిర్మించే సినిమాలు చేయాలని ఎప్పుడూ ఉంటుంది. ‘రాకెట్రీ- ద నంబీ ఎఫెక్ట్’ కూడా ఆ తరహా చిత్రమే కదా! అందులో శాస్త్రవేత్త నంబీ పాత్రను పోషించడాన్ని గర్వంగా భావించాను. చేయని తప్పునకు ఆయన పడిన మనోవ్యథను ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉద్దేశంతో ఆ చిత్రాన్ని నిర్మించాం. దానికి నిర్మాతగా, దర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తించడం మరింత ఆనందాన్నిచ్చింది.
ఫిక్షనల్ సబ్జెక్టులు ఎంచుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. నేను గతంలో చేసిన ‘త్రీ ఇడియట్స్’, ‘రంగ్ దే బసంతి’ సినిమాలు వినూత్నమైనవి. ఈ రెండు చిత్రాలూ సామాజిక మార్పునకు దోహదం చేసే కథాంశంతో నిర్మితమైనవి. ఒక కమర్షియల్ సినిమాలో నటించినప్పుడు కన్నా.. ఈ తరహా సినిమాలు చేసినప్పుడు ఎక్కువ సంతృప్తి కలుగుతుంది.
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) ప్రెసిడెంట్గా ఎంపికవ్వడం సంతోషంగా ఉంది. ఆ పదవి ఒక అలంకారం కాదు, బాధ్యత. ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థల్లో ఇదీ ఒకటి. ఇక్కడి ప్రమాణాలను మరింత ఉన్నతంగా మార్చే దిశగా నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా నేను విజయవంతం అవుతాననే నమ్మకం ఉంది.