M.S.Dhoni Movie Re-Release | ఇండియాలో సినిమాలకు, క్రికెట్కు ఉన్నంత క్రేజ్ బహుశా దేనికి లేదేమో. అంతలా ఈ రెండింటిని ప్రేక్షకులు తెగ ఆదరిస్తుంటారు. కొత్త సినిమాలు వచ్చినా, మ్యాచ్లు జరిగినా ఆ రోజు మన దేశంలో పండగ వాతావరణమే. అంతాలా వీటిని మనవాళ్లు సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అందుకే వీటికి ముడిపడిన ఏ అంశమైనా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక క్రికెట్ నేపథ్యంలో సినిమా వచ్చిందంటే దాని క్రేజ్ను ఊహించడం చాలా కష్టం. లగాన్, ఎమ్.ఎస్ ధోని, జెర్సీ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులే వాటికి ఉదాహరణ. ఇక ఇప్పుడున్న ప్రేక్షకులకు క్రికెట్ నేపథ్యంలో వచ్చిన సినిమా అంటే టక్కున గుర్తొచ్చేది ఎం.ఎస్.ధోని : ది అన్టోల్డ్ స్టోరీ సినిమానే.
మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బయోపిక్గా తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ధోని ఫ్యాన్స్ అయితే కట్టలు తెంచుకుని మరీ థియేటర్లకు పరుగులు తీశారు. ఈ సినిమా చూసి ఎమోషనల్ అవని సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. అతంలా ఈ సినిమాకు జనాలు కనెక్ట్ అయ్యారు. సినిమా వచ్చి ఏడేళ్లయినా.. ఇప్పటికే టీవిల్లో వస్తుందంటే అతుక్కుపోతుంటాం. అంతలా ఈ సినిమాతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ధోని పాత్రలో సుశాంత్ సింగ్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. ఆయన మరణించిన తర్వాత ఈ సినిమాకు ఇంకా ఆదరణ పెరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రీ-రిలీజ్కు సిద్దమైంది.
ధోని బర్త్డే సందర్భంగా జూలై 7న తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈ సినిమా రీ-రిలీజ్ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు హిందీలో రీ-రిలీజ్ కాగా.. తెలుగులో ఈ సినిమా తొలిసారి రీ-రిలీజ్ అవుతుంది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కియరా అద్వాణి, దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు. అనుపమ్ ఖేర్, భూమిక చావ్లా కీలకపాత్రల్లో నటించారు. ఏడేళ్ల కిందట రిలీజైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రెండొందల కోట్లు కొల్లగొట్టింది.