Lavanya Tripathi | సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా సినీ పరిశ్రమలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి మాట్లాడి సంచలనం రేపింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే చీకటి కోణాలు, మహిళలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కరోనా సమయంలో తాను ఒక తమిళ సినిమా ఒప్పుకున్నానని లావణ్య త్రిపాఠి వెల్లడించింది. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడి ప్రవర్తన తనకు ఏమాత్రం నచ్చలేదని ఆమె తెలిపింది. షూటింగ్ స్పాట్లో తాను సురక్షితంగా లేనట్టుగా అనిపించడంతో పాటు అసౌకర్యంగా భావించానని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ధైర్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నానని లావణ్య చెప్పింది.
అయితే సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయని ఆమె తెలిపింది. సదరు దర్శకుడు, నిర్మాతలు తనను టార్గెట్ చేసి పత్రికల్లో తప్పుడు కథనాలు రాయించారని, అంతేకాకుండా తనపై కేసులు కూడా పెట్టారని ఆమె ఆరోపించింది. ఆ సమయంలో తనకు ఎవరూ మద్దతుగా నిలవలేదని, తీవ్ర మానసిక వేదనను అనుభవించానని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో నెటిజన్లు, సినీ అభిమానులు ఈ అంశంపై చర్చిస్తున్నారు. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై మరోసారి చర్చ మొదలైంది.
ఇక లావణ్య త్రిపాఠి సినిమాల విషయానికి వస్తే, మెగా హీరో వరుణ్ తేజ్తో వివాహం తర్వాత ఆమె నటిస్తున్న తొలి చిత్రం ‘సతీ లీలావతి’. ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈ నెలలోనే సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.