Krithi Shetty Bollywood Entry | సినీరంగంలో కొంత మంది నటీమణులకు గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుంది. అదే కొంత మందికి మొదటి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు వస్తుంది. ఎంత మంచి పాత్రలు వచ్చిన, నటన ఎంత బాగా చేసిన అదృష్టం కూడా ఉండాలి అని సినీనటులు అంటుంటారు. అలా అదృష్టాన్ని అరచేతిలో పట్టుకుని ఇండస్ట్రీకి వచ్చింది కృతి శెట్టి. ఉప్పెన చిత్రంతో టాలీవుడ్లో ఉప్పెనలా దూసుకుపోతుంది. గతేడాది ప్రథమార్థంలో విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. ఈ చిత్ర విజయంలో 50శాతం క్రెడిట్ కృతిశెట్టికే దక్కుతుంది. ఈ చిత్రంలో అందం, అభినయంతో కృతి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ చిత్రంతో కృతికి అవకాశాలు క్యూ కట్టాయి. టైర్2 హీరోలకు ఈమె కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. ఈ క్రమంలోనే నానితో ‘శ్యామ్ సింగరాయ్’, నాగ చైతన్యతో ‘బంగార్రాజు’ చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి. దాంతో ఇప్పుడు కృతిశెట్టిని టాలీవుడ్ గోల్డెన్ లెగ్ పిలుస్తున్నారు. ప్రస్తుతం కృతి రామ్తో ‘ది వారియర్’, సుధీర్ బాబుకు జోడిగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్ సరసన ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాలలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
తాజాగా ఈ బ్యూటీకి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ తదుపరి సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చినట్లు బాలీవుడ్ వర్గాల్లో సమాచారం. ఇప్పటికే సంప్రదింపులు జరిగాయట. కృతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే షాహీద్ కపూర్ ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో ఒక హీరోయిన్గా నటించిన కృతినే రీమేక్లో కూడా నటింపచేయాలని మేకర్స్ భావిస్తున్నారట. షాహిద్ కపూర్ ఇదివరకే ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీ రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘జెర్సీ’ హిందీ రీమేక్ విడుదలకు సిద్ధంగా ఉంది.