తొలిచిత్రం ‘ఉప్పెన’లో అందం, అమాయకత్వం కలబోసిన బేబమ్మ పాత్రలో కుర్రకారు హృదయాల్ని దోచుకుంది కన్నడ సోయగం కృతిశెట్టి. ఆ తర్వాత వరుస అవకాశాలు వరించినా ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు. అయినా ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈ భామ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఖుషి’ చిత్రంలో రెండో నాయికగా నటించే లక్కీఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కశ్మీర్ నేపథ్య ప్రేమకథగా తెరకెక్కిస్తున్నారు.
సమంత కథానాయికగా నటిస్తున్నది. ఇప్పటికే యాభైశాతం చిత్రీకరణ పూర్తికాగా..సమంత అనారోగ్యం దృష్ట్యా మిగతా షూటింగ్ వాయిదా పడింది. అయితే కథానుగుణంగా ఈ సినిమాలో రెండో నాయికకు అవకాశం ఉండటంతో కృతిశెట్టిని సంప్రదించారని చెబుతున్నారు. కథ నచ్చడంతో పాటు విజయ్ దేవరకొండతో కలిసి తెరను పంచుకునే అవకాశం రావడంతో కృతిశెట్టి వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు. సినిమా ద్వితీయార్థంలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకురానుందని తెలిసింది.