నాగశౌర్య కథానాయకుడిగా నటించిన సినిమా ‘కృష్ణ వ్రిందా విహారి’. షెర్లీ సెటియా నాయికగా నటించింది. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మాణంలో దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ…‘శౌర్య ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. పాదయాత్ర చేశాడు. ఓ మంచి సందర్భాన్ని కుటుంబమంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లే…ఇలాంటి మంచి చిత్రాన్ని అందరూ కలిసి ఆస్వాదించండి.
ఈ చిత్రాన్ని చూస్తే మీకు జీవితంలో ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది. మీ డబ్బు, సమయానికి విలువనిచ్చే చిత్రమిది’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ…‘సినిమా బాగా లేకుంటే నేను ప్రమోషన్ చేయను. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మా సినిమాకు పేరొచ్చింది. వచ్చిన ఫలితంతో అందరం సంతోషంగా ఉన్నాం. ప్రేక్షకులు మరింత మంది సినిమా చూస్తే ఇంకా ఆనందిస్తాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు రాహుల్ రామకృష్ణ, సత్య, నటి హిమజ పాల్గొన్నారు.