Krish | పవర్స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా ఏఎం రత్నం సమర్పణలో రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’ . అనేక వాయిదాల తర్వాత ఈ మూవీ ఎట్టకేలకి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. గత ఐదేళ్లుగా వివిధ కారణాల వల్ల వాయిదాల పర్వం ఎదుర్కొన్న ఈ సినిమా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందు హైదరాబాద్లో ప్రెస్మీట్తో పాటు, శిల్పకళావేదికలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈవెంట్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడిపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ స్క్రిప్ట్ వినగానే ఇది సాధారణ కథ కాదని అర్థమైంది. కృష్ణా తీరంలో దొరికిన కోహినూర్ వజ్రం హైదరాబాద్ సుల్తానుల దగ్గరికి ఎలా వచ్చింది.. ఆ తర్వాత దాని ప్రయాణం ఎలా సాగింది అన్న నేపథ్యంలో జరిగే కథ ఇది. క్రిష్ జాగర్లమూడి మంచి కాన్సెప్ట్తో నా దగ్గరకు వచ్చారు. అందుకు ఆయన్ని అభినందించి తీరాలి’ అంటూ పవన్ పలుమార్లు చెప్పుకొచ్చారు. ఐదు సంవత్సరాల ప్రయాణం మధ్యలో క్రిష్ తప్పుకున్నా ఆయనపై పవన్ కళ్యాణ్ ఎలాంటి విమర్శలూ చేయలేదు. ఇక ఈ సినిమాపై ఇన్నాళ్లు ఎలాంటి కామెంట్ చేయని క్రిష్ తాజాగా స్పందించారు. వీరమల్లు విడుదల సందర్భంగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా ఒక భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు.
“వీరమల్లు నిశ్శబ్దంగా కాదు… సంకల్పంతో ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ప్రతి ఫ్రేమ్ వెనక చరిత్ర ఉంది, అంకితభావం ఉంది,” అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సాధారణ వ్యక్తి కాదు. కెమెరాలలో పట్టలేని అగ్ని ఆయనలో ఉంది. ఆ అగ్ని ఈ సినిమాకు ప్రాణం ఇచ్చింది. ఏఎం రత్నం గారు భారతీయ సినిమాకి ఓ ఆర్కిటెక్ట్ లాంటి వారు. ఈ స్థాయికి సినిమా రావడానికి వీరిద్దరి పాత్ర ఎంతో గొప్పది,” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగతంగా ఈ సినిమా నాకు ప్రత్యేకం అని క్రిష్ అన్నాడు. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ సందర్బంగా ఇద్దరు లెజెండ్స్ పవన్ కళ్యాణ్, ఏఎం రత్నం గార్లకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ క్రిష్ జాగర్లమూడి తన ట్వీట్లో రాసుకొచ్చారు. హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో క్రిష్ మధ్యలోనే ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. అనంతరం ఆయన అనుష్కతో ‘ఘాటి’ అనే కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. దీంతో ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి సినిమాను పూర్తి చేశారు.