ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘మిర్చి’ వంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రచయిత కొరటాల శివ త్వరలో క్రేజీ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ కాంబినేషన్ కనుక నిజంగా సెట్ అయితే అభిమానులకు కనుల పండుగగా ఉంటుంది.
సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి హిట్ కొట్టడంతో కొరటాల దిట్ట. ఇదే పంథాలో ఇప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకుడిగా రాణిస్తున్నారు. ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను,జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ‘ఆచార్య’ చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.
కొరటాల తన తదుపరి సినిమాని ఎన్టీఆర్తో చేయనుండగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తారక్ సినిమా తర్వాత కొరటాల ఓ మల్టీస్టారర్ మూవీ చేసే ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ, మహష్ బాబుతో కలిసి మల్టీ స్టారర్ చేయాలనే ఆలోచన కొరటాలకు ఉందని, త్వరలోనే దీనికి కార్యరూపం దాల్చనున్నాడని తెలుస్తుంది.