తన కెరీర్లో అత్యున్నత దశను చూస్తున్నది బాలీవుడ్ తార కియారా అద్వానీ. ఆమె ఖాతాలో చేరుతున్న క్రేజీ సినిమాలు చూస్తుంటే కియారా జోరు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. హీరోల సరసన మాస్ కమర్షియల్ చిత్రాలు చేస్తున్న ఈ భామ సోలో హీరోయన్గానూ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నది. ఇప్పటికే ‘గిల్టీ’, ‘ఇందూ కీ జవానీ’ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి విజయాలు దక్కించుకున్న కియారా…తాజాగా మరో సోలో సినిమా దక్కించుకుంది.
థ్రిల్లర్ కథతో దర్శకుడు విజయ్ లల్వానీ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ‘లాంబ్’ అనే టైటిల్ను ఈ చిత్రానికి పరిశీలిస్తున్నారు. నీరజ్ కొతారి, సరిత ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం కియారా చేతిలో ‘గోవింద్ నామ్ మేరా’, ‘సత్య ప్రేమ్కి కథ’ చిత్రాలతో పాటు రామ్ చరణ్ సరసన ‘ఆర్సీ 15’ సినిమాలో నటిస్తున్నది.