టాలీవుడ్ టైర్-2 హీరోలకు సమానంగా తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న నటుడు కార్తి. ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. కాగా కార్తి నటించిన సినిమాల్లో ‘ఖైదీ’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రంతో కార్తి వంద కోట్ల క్లబ్లో అడుగు పెట్టాడు. అంతేకాకుండా తెలుగులో ‘కార్తి’ మార్కెట్ అమాంతం పెరిగింది. లోకేష్ కనకరాజ్ టేకింగ్, విజన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్లోనే సీక్వెల్ ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. ఇక అప్పటి నుండి ఎప్పుడెప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా కార్తి సీక్వెల్పై క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం కార్తి నటించిన ‘పొన్నియన్ సెల్వన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రమోషన్లో భాగంగా కార్తి ‘ఖైదీ’ సీక్వెల్పై క్లారిటీ ఇచ్చాడు. ఖైదీ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం లోకేష్ విజయ్తో సినిమా చేస్తున్నాడు. అది పూర్తవ్వగానే సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయితాయిన వెల్లడించాడు.
మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ ౩౦న విడుదల కానుంది. చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.