సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తున్న ‘కేజీఎఫ్ 2’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. యష్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల బెంగళూరులో విడుదల చేశారు. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు ప్రశాంత్నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమవుతున్నది. ‘కేజీఎఫ్ 2’ తెలుగు ట్రైలర్ను రామ్ చరణ్, కన్నడ ట్రైలర్ను శివరాజ్కుమార్ విడుదల చేశారు. ‘రక్తంతో రాసిన కథ ఇది సిరాతో ముందుకు తీసుకెళ్లలేం..’ అంటూ సాగిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా హీరో యష్ మాట్లాడుతూ…‘కేజీఎఫ్ కన్నడ ప్రేక్షకుల కల. మీరంతా ఎంతగా అంచనాలు పెట్టుకున్నారో తెలుసు. ఈ సినిమా గురించి మొదట్లో మాట్లాడినప్పుడు, ఆలోచించినప్పుడు పిచ్చోళ్లు అనుకునేవారు. నిర్మాత విజయ్ కిరంగదూర్ మాకు అండగా నిలబడ్డారు. సినిమాకు కావాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చారు. మొదటి భాగం విడుదలయ్యాక ఆ ఘనతంతా నాకే ఇచ్చారు. కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ కష్టం, ఇతర చిత్రబృందం శ్రమ సినిమా విజయానికి కారణం. ‘కేజీఎఫ్ 2’ కూడా మీ అంచనాలకు మించి ఉంటుంది’ అన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ..‘ఈ చిత్రాన్ని పునీత్ రాజ్కుమార్ గారికి అంకితమిస్తున్నాం. ఈ సినిమా ఎంత విజయం సాధిస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేను గానీ ప్రపంచంలో సాంకేతికంగా గొప్ప చిత్రాల్లో ఒకటిగా మిగులుతుంది. కన్నడ సినిమాగా మొదలై ఇండియన్ సినిమా అయ్యింది. యష్ రాకింగ్ స్టార్. ఈ సినిమాలో కొన్ని మాటలు ఆయనే రాసుకున్నారు’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటి రవీనాటాండన్, దర్శకుడు కరణ్ జోహార్, నటుడు సంజయ్ దత్ తదితరులు పాల్గొన్నారు.