Keshava Chandra Ramavath OTT | జబర్దస్త్ రాకింగ్ రాకేశ్ (Rocking Rakesh) కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన తాజా చిత్రం కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్). ఈ సినిమాకు ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహించగా.. అనన్య కృష్ణన్, లోహిత్, మైమ్ మధు, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, ధనరాజ్, జోర్దార్ సుజాత తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఈ సినిమా డిసెంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేసింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని రంగబాయి తండాకు చెందిన యువకుడే కేశవచంద్ర రమావత్ (కేసీఆర్). చిన్నతనంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో కేసీఆర్ ప్రసంగాలు విని ఆయనపై అభిమానం పెంచుకుంటాడు. తండాలో అందరూ అతన్ని చోటా కేసీఆర్ అని పిలుస్తుంటారు. పేద గిరిజన కుటుంబం కావడం వల్ల కుటుంబాన్ని తానే వృద్ధిలోకి తీసుకురావాలని తపిస్తుంటాడు.
అదే ఊరిలో ఉండే మరదలు మంజు (అనన్య కృష్ణన్) కేశవ చంద్ర రమావత్ను ప్రేమిస్తుంటుంది. ఇరు కుటుంబాలు కూడా వారిద్దరికి పెళ్లి చేయాలనే నిర్ణయానికి వస్తారు. అయితే బాగా చదువుకున్న పట్నం అమ్మాయిని పెళ్లాడితే జీవితం బాగుంటుందని, కుటుంబ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయనే స్నేహితుల తప్పుడు మాటల ప్రభావంతో మంజును పెళ్లాడటానికి నిరాకరిస్తాడు కేశవ చంద్ర రమావత్. దీంతో మామ భీమ్లానాయక్ (మైమ్ మధు) ఆగ్రహానికి గురవుతాడు. ఈలోగా తండాలో ఉండే బాగా డబ్బున్న ఆసామి కూతురుతో కేశవ చంద్ర సంబంధం కుదుర్చుకుంటాడు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే తాను పెళ్లి చేసుకుంటానని, హైదరాబాద్కు వెళ్లి ఆయన్ని కలుసుకొని ఒప్పిస్తాననే లక్ష్యంతో కేశవ చంద్ర రమావత్ హైదరాబాద్కు చేరుకుంటాడు. అక్కడ అతనికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? రింగ్ రోడ్డు వల్ల తన ఊరి ఉనికే ప్రశ్నార్థమైన తరుణంలో ఆ సమస్య పరిష్కారానికి కేశవ చంద్ర రమావత్ ఏం చేశాడు? కుటుంబానికి మాటిచ్చిన విధంగానే కేసీఆర్ను తన ఊరికి తీసుకురాగలిగాడా? చివరకు కేశవ చంద్ర రమావత్ ఎవరితో కలిసి పెళ్లిపీటలెక్కాడు? అనే అసక్తికరమైన ప్రశ్నలకు సమాధానంగా సినిమా కథ నడుస్తుంది.