Unni Mukundan | మలయాళ నటుడు ఉన్ని ముకుందన్కు కేరళ హైకోర్టు షాకిచ్చింది. లైంగిక వేధింపుల కేసులో ఇచ్చిన స్టే ఆర్డర్ను నిలిపేసింది. ఈ సమస్యను బయట పరిష్కరించుకునేందుకు ఎలాంటి పత్రంపై సంతకం చేయలేదని బాధితురాలు వాంగ్మూలం ఇవ్వడంతో గతంలో ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చింది.
ఉన్ని ముకుందన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కొట్టాయం పట్టణానికి చెందిన ఓ యువతి 2018 సెప్టెంబర్ 15 న పోలీసులను ఆశ్రయించింది. అదే ఏడాది ఆగస్టు 23 స్టోరీ డిస్కషన్ కోసమని పిలిచి తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో ఉన్ని ముకుందన్ తరఫున వివాదాస్పద న్యాయమూర్తి సైబీ జోస్ కిడంగూర్ వాదించాడు. ఈ క్రమంలోనే బాధిత యువతి కోర్టు బయట కేసును పరిష్కరించుకునేందుకు అంగీకరించినట్లుగా ఒక ఫోర్జరీ పత్రాన్ని కోర్టుకు సమర్పించాడు. దీంతో సదరు యువతి వేసిన లైంగిక వేధింపుల కేసును హైకోర్టు కొట్టిపారేసింది. అయితే ఈ కేసులో తను ఎలాంటి సంతకం చేయలేదని బాధిత యువతి తాజాగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. దీంతోతప్పుడు పత్రాలు చూపించి కేసును తప్పుదోవ పట్టించాలని చూసినందుకు లాయర్ సైబీ జోస్ కిడంగూర్పై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తీవ్రమైన చర్య అని.. దీనిపై సమాధానం చెప్పాలని న్యాయవాదిని ఆదేశించింది. ఈ కేసులో ప్రత్యుత్తర అఫిడవిట్ దాఖలు చేయాలని ఉన్ని కృష్ణన్ను ఆదేశిస్తూ కేసును ఈ నెల 17కి వాయిదా వేసింది.
మలయాళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఉన్ని ముకుందన్.. ఎన్టీఆర్ జనతా గ్యారేజి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయయ్యాడు. ఆ తర్వాత భాగమతి, ఖిలాడీ సినిమాలతో పేరు తెచ్చుకున్నాడు. తాజాగా యశోద సినిమాతో హిట్ అందుకున్నాడు. రీసెంట్గా నటించిన మాలికాపురం సినిమా ఘన విజయం సాధించింది. మలయాళంలో రూ.100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది.