Keerthy Suresh | మహానటి సినిమాలో అద్భుతమైన అభినయంతో కోట్లాది మంది మనస్సుల్లో చెరగని ముద్రవేసుకుంది కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ (Keerthy Suresh). ఈ సినిమాకుగాను ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. కాగా ఈ భామకు సంబంధించిన గాసిప్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే.. కీర్తిసురేశ్ మరోసారి అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుందన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ ఇద్దరూ ఇప్పటికే మహానటి చిత్రంలో కలిసి మెరిశారని తెలిసిందే. రీసెంట్గా థ్యాంక్ యూ, కస్టడీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు చైతూ. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. కార్తికేయ 2 డైరెక్టర్ చందూ మొండేటి (Chandoo Mondeti)దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. గతంలో చైతూ-చందూమొండేటి కాంబోలో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు వచ్చాయి.
ముందుగా వచ్చిన వార్తల ప్రకారం చైతూ గీతాఆర్ట్స్ బ్యానర్లో కొత్త దర్శకుడితో సినిమా చేయాల్సింది. అయితే నాగచైతన్యతో సినిమా చేసే విషయమై నిర్మాత అల్లు అరవింద్ డైరెక్టర్ చందూమొండేటిని ఒప్పించాడని, ఈ సినిమాకు సంబంధించిన ఫార్మాలిటీస్ కూడా కొన్ని రోజుల క్రితమే పూర్తయ్యాయని ఇన్సైడ్ టాక్.
ప్రస్తుతం మేకర్స్ హీరోయిన్ ఎంపికలో బిజీగా ఉండగా.. అనుపమ పరమేశ్వరన్ను ఫైనల్ చేయాలని ఫిక్స్ అయినట్టు ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా కీర్తిసురేశ్ పేరు వినిపిస్తోంది. ఇటీవలే నానితో కలిసి నటించిన మాస్ ఎంటర్టైనర్ దసరా సక్సెస్తో ఫుల్ జోష్ మీదుంది కీర్తిసురేశ్. కీర్తిసురేశ్ ట్రాక్ రికార్డు చైతూ సినిమాకు బాగా కలిసొస్తుందని.. ఆమె అయితే బాగుంటుందని అనుకుంటున్నారట మేకర్స్.
కీర్తిసురేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి అంతా అనుకున్నట్టుగా కుదిరితే కొంతకాలంగా సరైన హిట్స్ లేని చైతూకు.. కీర్తిసురేశ్ ఎంట్రీ ఎలా పనిచేస్తుందో చూడాలంటున్నారు సినీ జనాలు.