Keerthy Suresh | ‘విభిన్నమైన కథల్ని ఎంచుకొని సినిమాలు చేస్తున్నా. పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఫలానా పాత్ర నేను చేయలేకపోయానని బాధపడొద్దు’ అని చెప్పింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ఆమె చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించిన ‘భోళాశంకర్’ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం కీర్తి సురేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘గతంలో నేను రజనీకాంత్ సిస్టర్ పాత్రలో నటించాను. ఇప్పుడు ‘భోళాశంకర్’లో చిరంజీవి చెల్లెలుగా నటించే అవకాశం వచ్చింది. ఇద్దరు సూపర్స్టార్స్తో నటించాను. ఓ నటిగా ఇంతకంటే నాకు ఏం కావాలి? చిరంజీవిగారితో ఒక్క ఫ్రేమ్లోనైనా డ్యాన్స్ చేయాలనే కోరిక ఉండేది.
ఈ సినిమాతో అది తీరిపోయింది. అన్నయ్యతో సరదాగా, సంతోషంగా ఉండే చెల్లెలిగా ఈ సినిమాలో నా పాత్ర సాగుతుంది. చిరంజీవిగారితో మా అమ్మ ‘పున్నమినాగు’ చిత్రంలో నటించింది. అప్పటి చాలా విషయాలను అమ్మ నాతో చెప్పింది. చిరంజీవిగారు సెట్లో నాటి రోజులను గుర్తుచేస్తూ ‘మీ అమ్మ చాలా అమాయకురాలు. నువ్వు మాత్రం అలా కాదు. చాలా తెలివైన అమ్మాయివి’ అని మెచ్చుకున్నారు. ఆయన్ని నేను సెట్లో చిరుగారు అని పిలిచేదాన్ని. చిరంజీవిగారి ఇంటి నుంచే రోజూ నాకు భోజనం వచ్చేది. ఇష్టమైన వంటకాలను కోరి మరీ తెప్పించుకునేదాన్ని. దాంతో మా ఇద్దరి మధ్య భోజనం గురించిన టాపిక్స్ ఎక్కువగా వచ్చేవి (నవ్వుతూ). కెరీర్కు గుడ్బై చెప్పే లోపు అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా’ అని చెప్పింది.