Yellamma | ‘బలగం’ సినిమాతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుని దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వేణు యెల్దండి ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్గా ‘ఎల్లమ్మ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ‘బలగం’ విజయంతో వేణు యెల్దండి మేకింగ్పై ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఏర్పడటంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మొదట ఈ ప్రాజెక్ట్లో హీరోగా నాని లేదా నితిన్ వంటి స్టార్ హీరోలు నటించబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో మహానటి కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చాయి. కథ, పాత్ర బలంగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్పై ఆమె ప్రత్యేక ఆసక్తి కనబరిచినట్లు అప్పట్లో టాలీవుడ్లో చర్చ జరిగింది.
అయితే తరువాత కథలో కొన్ని మార్పులు చోటుచేసుకోవడంతో పాటు హీరో ఎంపికలో కూడా మార్పులు జరిగాయి. చివరికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో సినిమా సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం, దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తుండటంతో కీర్తి సురేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ లీడ్ రోల్లో ఉంటే తాను ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి లేనని ఆమె నిర్మాతలకు సున్నితంగా తెలియజేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి కీర్తి తప్పుకోవడం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది.
ఇక దేవి శ్రీ ప్రసాద్ మాత్రం హీరోగా తన తొలి సినిమా కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన డీఎస్పీ, ఇప్పుడు నటుడిగా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారని సమాచారం. ఇక ‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. అందుకే చిత్ర బృందం నటనకు ప్రాధాన్యమున్న హీరోయిన్లను సంప్రదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సాయి పల్లవి వంటి నటీమణులను సంప్రదిస్తున్నట్టు టాక్ వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.