కార్తీ సినిమా అంటే కథలో ఏదో వైవిధ్యం ఉంటుందన్నది ప్రేక్షకుల నమ్మకం. కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథలతో ప్రయాణం సాగిస్తున్నారాయన. ‘సత్యం సుందరం’తో గత ఏడాది మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు విమర్శకుల్ని మెప్పించారు. తాజాగా కార్తీ తన 29 చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘మార్షల్’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిజా దర్శకత్వం వహిస్తున్నారు.
గురువారం సినిమాను ప్రారంభించడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ను కూడా మొదలుపెట్టారు. ‘అత్యున్నత సాంకేతిక, నిర్మాణ విలువలతో తెరకెక్కించబోతున్న యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ఇది. కార్తీ మునుపెన్నడూ చూడని కొత్త పాత్రలో కనిపిస్తారు’ అని చిత్రబృందం పేర్కొంది. కల్యాణి ప్రియదర్శన్, సత్యరాజ్, ప్రభు, లాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్, సంగీతం: సాయి అభ్యంకర్, నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్బాబు, ఎస్.ఆర్. ప్రభు, రచన-దర్శకత్వం: తమిజా.