Kareena Kapoor | ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో ఒళ్లుమండే ప్రశ్నలడుగుతూ పుళ్లమీద కారం జల్లే పనిలో బిజీ అయిపోయాడు కరణ్జోహార్. రీసెంట్ ఇంటర్వ్యూలో కరీనా, అలియా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో చేదు జ్ఞాపకాలను వెలికితీస్తూ కరీనాను కాస్తంత ఇబ్బందికి గురిచేసే ప్రయత్నమే చేశాడు కరణ్. ‘ఇటీవల జరిగిన ‘గదర్- 2’ పార్టీకి ఎందుకు అటెండ్ కాలేదు. అమీషాకూ నీకూ మధ్య ఏదో భయంకరమైన ఫ్లాష్బ్యాక్ ఉన్నట్టుంది?’ అని అడిగాడు కరణ్. ‘ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడంలేదు’ అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చేసింది కరీనా. ‘కహోనా ప్యార్ హై’లో నువ్వే కదా ఫస్ట్ హీరోయిన్?’ అని కరణ్ రెట్టించి అడగడంతో కరీనాకు ఫేస్ మారిపోయింది. సమాధానమివ్వకుండా మౌనంగా ఉండిపోయింది.
ఇక అసలు విషయానికొస్తే.. 2000లో విడుదలైన ‘కహోనా ప్యార్హై’ అఖండ విజయాన్ని చూసింది. ఆ సినిమాకు తొలుత హీరోయిన్గా దర్శకుడు రాకేష్రోషన్ కరీనానే ఎంపిక చేశాడు. కానీ అనుకోని మనస్పర్థల వల్ల కరీనాను తొలగించి అమీషా పటేల్ని తీసుకోవడం జరిగింది. అప్పట్నుంచి కరీనాకు, అమీషాకు మాటల్లేవ్. ఈ విషయాన్ని అమీషానే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపింది. జరిగిపోయిన ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తుచేస్తూ కరీనాను దాదాపుగా ఇరిటేట్ చేశాడు కరణ్జోహార్. అంతటితో వదల్లేదు తను. ‘దీపికా పదుకొణేకు నువ్వు పోటీ అనుకుంటున్నావా?’ అనడిగాడు. ‘ ఆ ప్రశ్న నువ్వడగాల్సింది నా పక్కనే ఉన్న అలియాను.. నన్ను కాదు’ అంటూ డిగ్నిఫైడ్ సమాధానంతో కరణ్ను ఖంగు తినిపించింది కరీనా.