Kantara Movie-2 | కొన్ని సినిమాలను మాటల్లో వర్ణించడానికి పదాలు చాలవు. డిక్షనరి కొనుక్కొని కొత్త కొత్త పదాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా మాటల్లో చెప్పలేని సినిమాల్లో ‘కాంతార’ ఒకటి. తెలిసిన కథే కావచ్చు.. కానీ ఆ కథనే ఎంత కొత్తగా చెప్పాము అనేది దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఈ విషయంలో వందకు వంద మార్కులు కొట్టేశాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ఈ సినిమాలో రిషబ్శెట్టి దర్శకుడిగా ఒక మెట్టు ఎక్కితే.. నటుడిగా పది మెట్లు ఒకేసారి ఎక్కాడు. గతేడాది బిగ్గెస్ట్ హిట్లలో ‘కాంతార’ ఒకటి. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. గతేడాది సెప్టెంబర్లో భారీ అంచనాల నడుమ కన్నడలో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధించింది.
ఈ సినిమాకు వస్తున్న ఆధరణతో అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో మేకర్స్ పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇక రిలీజైన ప్రతి భాషలో భారీ వసూళ్ళను సాధిస్తూ డబుల్ బ్లాక్బస్టర్ నిలిచింది. ఇటీవలే ఈ సినిమాకు ప్రీక్వెల్ ఉండనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తాజాగా దీనిపై హీరో కమ్ డైరెక్టర్ రిషబ్శెట్టి స్పందించాడు. ఇప్పటివరకు మీరు చూసిన కాంతార పార్ట్-2 అని, మొదటి పార్ట్ వచ్చే సంవత్సరం వస్తుందని చెప్పాడు. దీంతో ప్రీక్వెల్పై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇన్నేళ్ల సినీ చరిత్రలో ఒక పార్ట్-2, తర్వాత పార్ట్-1 రావడం బహుశా ఇదే మొదటిసారేమో. ప్రీక్వెల్లో రిషబ్ తండ్రి జీవితం, ఆయన చనిపోయి ఎటెళ్లారు అనే అంశాలను చూపించబోతున్నట్లు టాక్. ఇందులో భాగంగానే రిషబ్ ఇటీవలే కర్ణాటకలోని కోస్టల్ ప్రాంతానికి వెళ్లాడట. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లి, వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తు్న్నారట. ఇక కాంతారకు వచ్చిన క్రేజ్తో ప్రీక్వెల్ను మరింత గ్రాండ్ స్కేల్లో రూపొందించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.