Kantara | స్వీయ దర్శకత్వంలో రిషబ్శెట్టి కథానాయకుడిగా నటించిన ‘కాంతార’ చిత్రం అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నేడు ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. ఈ చిత్రాన్ని వివిధ దేశాల ప్రతినిధులు వీక్షిస్తారని, ఈ సందర్భంగా హీరో రిషబ్శెట్టి ప్రత్యేక ప్రసంగం చేస్తారని ఐక్యరాజ్య సమితికి చెందిన గ్లోబల్ ఎఫైర్స్ విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది కన్నడంలో విడుదలైన ‘కాంతార’ చిత్రం వివిధ భారతీయ భాషల్లోకి అనువదించబడి పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించింది.
దక్షిణ కన్నడకు చెందిన భూతకోలా దైవారాధన, అడవి బిడ్డల అస్తిత్వ పోరాటం నేపథ్యంలో డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ‘కాంతార’ విశేష ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఐక్యరాజ్యసమితిలో స్క్రీనింగ్ కాబోతుండటం భారతీయ సినిమాకు లభించిన గొప్ప గౌరవమని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా ప్రస్థానం, పర్యావరణ మార్పులు..పరిరక్షణ అంశాలపై రిషబ్శెట్టి ఐక్యరాజ్య సమితి వేదికపై మాట్లాడుతారని ‘కాంతార’ చిత్రబృందం పేర్కొంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్ సన్నాహాల్లో ఉన్నారు దర్శకహీరో రిషబ్శెట్టి.