నటీనటులు రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించింది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. మంచి చిత్రాల విజయాలను ఎవరూ ఆపలేరని ఆమె అభిప్రాయపడింది. అయితే సినిమాల విజయాలను కేవలం అంకెలతో పోల్చిచూడటం సరికాదని చెప్పింది. కంగనా రనౌత్ స్పందిస్తూ…‘కష్టపడి మంచి చిత్రాన్ని రూపొందించిన వారు ఆ విజయాన్ని ఆస్వాదించండి. వివాదాల పర్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాలు చేయకండి. నటీనటులు రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిది.
ఇవాళ ఏ సినిమా విజయాన్నైనా కేవలం అంకెలతోనే లెక్కిస్తున్నారు. ఇదొక కళ అనీ, దీనికి ఆదాయం ఒక్కటే పరమార్థం కాదని తెలుసుకోవడం లేదు. గత తరం క్లాసిక్స్ ‘ప్యాసా’, ‘శ్రీ 420’, ‘గైడ్’ వసూళ్ల గురించి ప్రేక్షకులకు తెలుసా? అవన్నీ గొప్ప చిత్రాలుగా మనకు గుర్తుండిపోయాయి. సినిమా ఒక సామాజిక ఉత్సవం కావాలి. ప్రజలను మరింత దగ్గర చేయాలి. పదేండ్ల కిందటి నుంచి ఈ బాక్సాఫీస్ లెక్కల పోకడ మొదలైంది. చిత్ర పరిశ్రమ ఈ తరహా ట్రెండ్ నుంచి వెనక్కి రావాలి. సినిమాకు వచ్చే ఆదాయం ప్రేక్షకులు చూపించే ప్రేమకు నిదర్శనమని భావించాలి’ అని పేర్కొంది. షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ‘పఠాన్’ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తున్న సమయంలో కంగనా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆ చిత్రాన్ని ఉద్దేశించే కంగనా ఇలా మాట్లాడిందని అంటున్నారు.