కమల్హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’. గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. సూర్య అతిథి పాత్రను పోషిస్తున్నారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. హీరో నితిన్ స్వీయ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నది.
ఉభయ తెలుగు రాష్ర్టాల్లో దాదాపు 440కు పైగా థియేటర్లలో చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నామని నిర్మాత సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘యు.ఏ.’ సర్టిఫికెట్ లభించింది. ఇదిలా ఉండగా నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి గురువారం చెన్నైలో కమల్హాసన్ను కలిశారు. ‘విక్రమ్’ చిత్ర తెలుగు పోస్టర్ను కమల్హాసన్కు అందించారు.
ఈ సినిమాలో కమల్హాసన్ అండర్కవర్ పోలీస్ పాత్రలో కనిపిస్తారని, అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు ఆయన అనుసరించే వ్యూహాలు ఉత్కంఠంను పంచుతాయని చెబుతున్నారు. ఫహద్ ఫాజిల్, కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జుణ్దాస్, శివాని నారాయణన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాణ సంస్థ: రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, దర్శకత్వం: లోకేష్ కనకరాజ్.