భారతీయ సినిమాను అత్యున్నత స్థానంలో నిలిపిన లెజండరీ స్టార్స్లో రజనీకాంత్, కమల్ హాసన్ తప్పక ఉంటారు. తమిళ నాట ఈ ఇద్దరు హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ మాస్ చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తుంటే కమల్ హాసన్ ప్రయోగాత్మక చిత్రాలతో ఆడియన్స్ను థ్రిల్ చేస్తుంటాడు. ప్రస్తుతం కమల్ హాసన్ ఇటు సినిమాలు అటు రాజకీయాలతో బిజీగా ఉండగా, రజనీకాంత్ అనారోగ్యం వలన కేవలం సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టాడు.
రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తె అనే చిత్ర షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయనున్నట్టు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. ఇక కమల్ హాసన్ నటిస్తున్న విక్రమ్ చిత్రం కూడా అదే రోజున విడుదల కానుందని కోలీవుడ్ టాక్. 2005లో కమల్ హాసన్ నటించిన ముంబై ఎక్స్ప్రెస్, రజనీకాంత్ నటించిన చంద్రముఖి చిత్రాలు ఒకే రోజు విడుదల కాగా, ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత ఇద్దరు లెజండరీ స్టార్స్ ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ పోటీలో గెలుపెవరిదనేది ఆసక్తిరంగా మారింది.